మెండంగిలో తాగునీటి సమస్యపై ఆరా
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:49 PM
మండలంలోని పనసభద్ర పంచాయతీ మెండంగిలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు.
మక్కువ రూరల్, జనవరి1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పనసభద్ర పంచాయతీ మెండంగిలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు. ఇటీవల ‘వారి దాహం తీర్చేది.. ఊటనీరే’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆర్డబ్ల్యూఎస్ డీఈ పి.మధుకుమార్ రెడ్డి స్పందించారు. గురువారం మెండంగి గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. తాగునీటి సమస్యపై ఆరా తీశారు. కొండపై నుంచి వచ్చే ఊటనీరు తాగడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను తెలిపారు. అనంతరం డీఈ పి.మధుకుమార్ రెడ్డి మాట్లాడుతూ మెండంగిలో తాగునీటి సమస్యను పరిశీలించామన్నారు. నీరు నిల్వ చేసే ట్యాంక్ను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. లీక్లు లేకుండా చూస్తామన్నారు. ట్యాంక్ నీటిలో ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా చర్యలు చేపడతామన్నారు. వేసవిలో ఊట ద్వారా వచ్చేనీరు చాలడం లేదని ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరారన్నారు. స్థానికంగా ఉన్న బోరును బాగుచేయిస్తామన్నారు.