వేతనదారుల సంఖ్య పెంచండి: ఏపీడీ
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:15 AM
ఉపాధి హామీ వేతనదారుల సంఖ్య పెంచాలని పార్వతీపురం డివిజన్ ఉపాధి ఏపీడీ పాడ్రంకి త్రివిక్రమరావు ఆదేశించారు.
గరుగుబిల్లి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ వేతనదారుల సంఖ్య పెంచాలని పార్వతీపురం డివిజన్ ఉపాధి ఏపీడీ పాడ్రంకి త్రివిక్రమరావు ఆదేశించారు. మంగళ వారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధి లోని ఎనిమిది మండలాల్లో 42 వేలకు పైగా వేతనదారులు పనుల్లో పాల్గొనవలసి ఉండగా, ప్రస్తుతం 25 వేల మంది వేతనదారులు పను లకు రావడానికి కారణమేంటని ఆరా తీశారు. పంచాయతీల వారీగా నిర్దేశించిన వేతనదారులు పనుల్లో పాల్గొనేలా చూడాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఉపాధికి సంబంధించి నూతన చట్టం అమలు కానుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరలో వేతనదారుల సంఖ్య పెంచడంతో పాటు నిర్దేశించిన పనులు పూర్తిస్థాయిలో నిర్వహిస్తే తదుపరి వేతనదారులకు ఉపాధి అవకాశాలు పెరిగే పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో నూతన చట్టం అమలు, నిర్వహణపై వేతనదారులకు అవగాహన కల్పించాలన్నారు. మన్యం జిల్లాకు సంబంధించి సీసీ రహదారులు, బీటీ రహదారులు, కల్వర్టులతో పాటు పలు అభివృద్ధి పనులు నిర్వహణకు రూ. 158 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. నిబంధనల మేరకు పనులు నిర్వహించకుంటే చెల్లింపులు జరగవన్నారు. సమావేశం లో ఏపీవో ఈశ్వరమ్మ, జేఈ దాసరి తేజేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.