In the snow blanket.. మంచు దుప్పట్లో..
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:52 PM
In the snow blanket.. మంచు ముంచుతోంది. అడుగు దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించని స్థాయిలో కురుస్తోంది. ఉదయం 9 గంటలైనా వీడడం లేదు. వేకువజామున ప్రయాణం అతికష్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అధికంగా ఉంటోంది. రోజురోజుకూ ముంచు ప్రభావం పెరుగుతోంది. మరోవైపు జిల్లాపై అల్పపీడన ప్రభావం ఉండొచ్చునని వాతావరణ నిపుణులు ముందే అంచనా వేశారు.
మంచు దుప్పట్లో..
జిల్లాలో దట్టంగా కురుస్తున్న మంచు
మామిడి, అపరాలపై ప్రభావం
మనిషి ఆరోగ్యానికీ ఇబ్బందులు
విజయనగరం రూరల్/రాజాం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): మంచు ముంచుతోంది. అడుగు దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించని స్థాయిలో కురుస్తోంది. ఉదయం 9 గంటలైనా వీడడం లేదు. వేకువజామున ప్రయాణం అతికష్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అధికంగా ఉంటోంది. రోజురోజుకూ ముంచు ప్రభావం పెరుగుతోంది. మరోవైపు జిల్లాపై అల్పపీడన ప్రభావం ఉండొచ్చునని వాతావరణ నిపుణులు ముందే అంచనా వేశారు. ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. పగటిపూట కూడా మేఘాలు కమ్ముతున్నాయి. మంచు వల్ల రోడ్లపై ప్రయాణం ఇబ్బందిగా మారింది. మరోవైపు మామిడి, అపరాలు సాగు చేస్తున్న రైతులు మంచును చూసి టెన్షన్ పడుతున్నారు. నష్టం పెరుగుతుందేమోనని భయపడుతున్నారు.
జిల్లాలో లక్ష ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. విజయనగరం, గరివిడి, మెరకముడిదాం, దత్తిరాజేరు, రాజాం ప్రాంతాల్లో మామిడి పంట అధికంగా ఉంది. మంచు ప్రభావం వల్ల తేనె మంచు పురుగు ఆశించే ప్రమాదం ఉంది. ఆపరాల పంటల విషయానికి వస్తే 70 వేల ఎకరాల్లో ఆపరాలు సాగుచేస్తున్నారు. కొత్తవలస, గజపతినగరం, విజయనగరం, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో ఆపరాలు సాగవుతున్నాయి. వీటికి కూడా మంచు ప్రభావంతో పురుగు పట్టే ప్రమాదం ఉంది. చీపురుపల్లి, పూసపాటిరేగ, రాజాం, సంతకవిటి, రేగిడి వంటి ప్రాంతాల్లో మొక్కజొన్న సాగువుతున్నది. మొక్కజొన్నకూ ఇబ్బందికర పరిస్థితి ఉంది.
- జిల్లాలో విస్తృతంగా కురుస్తున్న మంచు కారణంగా దగ్గు, జలుబుతో పాటు ఆయాసం వంటి వాటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు అవస్థలు ఎదుర్కొంటున్నారు. గత మూడేళ్లలో ఈ స్థాయిలో మంచు ప్రభావం లేదని, ఈ ఏడాది అధికంగా కురుస్తున్న మంచువల్ల పంటలకే కాకుండా ప్రజల ఆరోగ్యంపైనా ప్రభావం కనిపిస్తోంది.
- మామిడిపై పురుగు నియంత్రణకు లీటరు నీటిలో 1.5 మిల్లీలీటర్ల మోనోక్రోటాపాస్ లేదా రెండు మిల్లీ లీటర్ల డైమిథోయేట్ కలిపి పూత మొదలయ్యే సమయం, పిందెలు కట్టే ముందు చెట్లపై పిచికారీ చేయాలి. మొగ్గ దశలో కనిపిస్తే మాత్రం లీటరు నీటిలో 1.2 మిల్లీ లీటర్ల బ్యూఫ్రో ఫెజిన్-25 ఎస్సి లేదా 0.3 గ్రాముల థయోమిథాక్సిమ్ కలిపి చల్లాలి. పూత మసికి కారణమైన శిలీంద్రాల నివారణకు లీటరు నీటిలో 2 మిల్లీ లీటర్ల హైక్సోకొనజోల్ లేదా మిల్లీ లీటరు ప్రొపికొనజోల్ కలిపి చల్లాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు.
సస్యరక్షణ ముఖ్యం..
మామిడి పంటకు యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ ముఖ్యం. ఈ సంవత్సరం వర్షాలతో చెట్లకు నీటి తడులు అందాయి. అందుకే పూత బాగుంది. అయితే ఉష్ణోగ్రతలో మార్పులు, పొగమంచు కారణంగా పురుగు ఆవహించి పూత రాలుతోంది. అటువంటి వారు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి తక్షణం సస్యరక్షణ చేపట్టాలి.
ఉమామహేశ్వరి, ఉద్యాన శాఖ అధికారి, రాజాం