కదలని ఏనుగులు
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:11 AM
మండలంలోని నులకజోడు నుంచి ఏనుగులు కదలడం లేదు. వారం రోజులుగా నాలుగు ఏనుగుల గుంపు ఇక్కడే తిష్ఠవేసింది.
- వారం రోజులుగా నులకజోడులో తిష్ఠ
భామిని, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నులకజోడు నుంచి ఏనుగులు కదలడం లేదు. వారం రోజులుగా నాలుగు ఏనుగుల గుంపు ఇక్కడే తిష్ఠవేసింది. కొత్త చెరువు ప్రాంతంలో మొక్కజొన్న, వరి పంటలకు నష్టం కలిగిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం గ్రామ సమీపానికి ఏనుగులు రావడంతో వాటిని చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. అటవీశాఖ సిబ్బంది ప్రజలను నియంత్రిస్తూ ఏనుగులను సెల్ఫోన్లతో ఫొటోలు తీయవద్దని, ఆకతాయితనానికి పాల్పడవద్దని సూచించారు. గ్రామ సమీపంలో ఏనుగులు సంచరించడం ఇదే తొలిసారి అని గ్రామస్థులు తెలిపారు. పొలం పనులకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్న నేపథ్యంలో వాటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని కోరుతున్నారు.
అంకుళ్లవలసలో మరో గుంపు..
కొమరాడ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంకుళ్లవలస గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కవ్వింపు చర్యలకు పాల్పడరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.