How to Buy Fertilizer? ఎరువు కొనేదెలా?
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:06 AM
How to Buy Fertilizer? జిల్లాలో రైతన్నలకు ఎరువుల ధరలు భారంగా మారాయి. ఇప్పటికే అప్పులు చేసి రబీ సాగు చేపట్టిన వారికి.. ఎరువుల ధరలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అదనపు భారం తప్పడం లేదని ఆవేదన
అంతర్జాతీయ పరిస్థితులే కారణమంటున్న వ్యాపారులు
పాలకొండ,ఫిబ్రవరి22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతన్నలకు ఎరువుల ధరలు భారంగా మారాయి. ఇప్పటికే అప్పులు చేసి రబీ సాగు చేపట్టిన వారికి.. ఎరువుల ధరలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాస్తవంగా జిల్లాలో 70 శాతం మంది వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. దాదాపు 2.13 లక్షల మంది 98,920 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. కాగా రబీ సీజన్లో అత్యధికులు మొక్కజొన్న, నువ్వులు, అపరాలు, చెరకు, అరటి తదితర పంటలు సాగు చేపట్టారు. సాగునీటి సరఫరా ఉన్నచోట్ల కొందరు వరి కూడా వేసుకున్నారు. అయితే వాటన్నింటికీ రసాయన ఎరువులు అవసరం. సేంద్రియ వ్యవసాయంపై మొగ్గుచూపాలని ప్రభుత్వాలు, అధి కారులు అవగాహనా కల్పిస్తున్నా.. జిల్లా వాతావరణ పరిస్థితులు అందుకు అను కూలించడం లేదు. దీంతో అన్నదాతలకు రసాయన ఎరువుల వినియోగం తప్పనిసరి అయింది. అయితే రసా యన ఎరువులు ధరలు పెరగడంతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా, డీఏపీ మినహా మిశ్రమ ఎరువుల తయారీకి ముడిసరుకు అవసరం. ఆ ముడి సరుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు అధికంగా పెరగడంతో దేశంలోని ఎరువుల ధరలు అమాంతం పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
విక్రయాల్లో అక్రమాలు...
ఇప్పటికే బహిరంగ మార్కెట్లో రసాయన ఎరువులు ధరలు విపరీతంగా పెరగ్గా.. మరోవైపు కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఎంఆర్పీ కంటే అధికంగా అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ఽ వ్యాపారులు చెప్పిన ధరకే ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా.. జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీ చేపడుతున్నా.. కొంతమంది వ్యవసాయశాఖ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాజకీయ నాయకులు, అధికారుల సిఫారసులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా సామాన్య, మధ్యతరగతి రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందని పరిస్థితి ఉంది. ఈ పంపిణీపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాలని అన్నదాతలు కోరుతున్నారు.
పెరిగిన ధరలు ఇలా...
50 కిలోల 15.15.15 మిశ్రమ ఎరువు రబీ ప్రారంభంలో రూ.1,150 ఉండగా, ప్రస్తుతం రూ.1,650కి చేరింది. 20.20.13 కాంప్లెక్స్ ఎరువు (50 కిలోల బస్తా) రూ.1400 ఉండగా, ఇప్పుడు రూ.1500 పెరిగింది. 10.26.26 కాంప్లెక్స్ ఎరువు ధర రూ.1900 ఉండగా రూ.2,100కు చేరింది. 14.35.14 ఎరువు బస్తా రూ.1950 ఉండగా, ప్రస్తుతం రూ.2,150కు అమ్ముతున్నారు. రూ.1600 ఉన్న 16.16.16 ఎరువు రూ.1675కు చేరింది.
సేంద్రియ సాగుకు ప్రోత్సాహం
సేంద్రియ సాగును కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. రైతులు ఆ దిశగా సాగు చేస్తే.. అధిక దిగుబడులు సాధించొచ్చు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాల్సి ఉంది.
- ఆర్.అన్నపూర్ణ, డీఏవో