Hoping they all return safely... వారంతా క్షేమంగా రావాలని..
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:18 AM
Hoping they all return safely... విశాఖలో నివాసముంటున్న ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు కారి సీతోడు, కారి గరగయ్య, అమర అప్పలరాజు, మేడ చిన్న అమ్మోరు, కారి చిన్నయ్యల క్షేమ సమాచారం కోసం ఇక్కడి వారి బంధువులు ఎదురుచూస్తున్నారు.
వారంతా క్షేమంగా రావాలని..
ఎదురుచూస్తున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులు
ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు
భోగాపురం, జూలై6(ఆంధ్రజ్యోతి): విశాఖలో నివాసముంటున్న ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు కారి సీతోడు, కారి గరగయ్య, అమర అప్పలరాజు, మేడ చిన్న అమ్మోరు, కారి చిన్నయ్యల క్షేమ సమాచారం కోసం ఇక్కడి వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. మత్స్యకారులు విశాఖ నుంచి వేటకు వెళ్లాక ఈ నెల 4న సంద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో బోటు ఓనర్ కారి చిన్న మాత్రమే కోస్టుగార్డు నౌకలో సురక్షితంగా ఉన్నారు. గల్లంతైన మిగతా వారికోసం ప్రభుత్వం రెండు రోజులుగా సముద్రంలో గాలిస్తోంది. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు సమన్వయం చేసుకొంటూ గాలిస్తున్నారు. విశాఖకు చెందిన ఐసిజిఎస్ వీర నౌక కూడా గాలింపు చర్యలు చేపడుతోంది. మరోవైపు గగనతలం నుంచి వెతికేందుకు మూడు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. గాలింపు చర్యలన్నింటినీ కోస్ట్గార్డ్ రీజనల్ ఆపరేషన్స్ స్టేషన్ నుంచి విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టీ పర్యవేక్షిస్తున్నారు. మత్స్యకారుడు కారి చిన్న ప్రస్తుతం విశాఖ తీరానికి తూర్పున సుమారు 12 నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసి ఉన్న ఎంవి యూనివర్స్ వెల్తీ నౌకలోనే సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. తమ వారిని ప్రభుత్వం ఎలాగైనా ప్రాణాలతో తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయా కుటుంబాలు వేడుకుంటున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ లభిస్తుందన్న ఆశతో విశాఖ తీరంలోనే ఉండి సముద్రం వైపు కల్లార్పకుండా చూస్తున్నారు. వారంతా ప్రాణాలతో రావాలని గంగమ్మతల్లిని వేడుకొంటున్నారు.
గల్లంతైన వారి వివరాల సేకరణ
భోగాపురం, జూలై6(ఆంధ్రజ్యోతి): గల్లంతైన ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు విశాఖ జాలారుపేటలో నివాసముంటూ వేటకెళ్లారు. వారి కుటుంబ సభ్యులను జిల్లా రెవెన్యూ అధికారులు సోమవారం విశాఖపట్నం వెళ్లి పరామర్శించారు. గల్లంతైన వారి వివరాలు సేకరించారు. కారి సీతోడు, కారి గరగయ్య, అమర అప్పలరాజు, మేడ చిన్న అమ్మోరు, కారి చిన్నతో పాటు ఎంవి యూనివర్స్ వెల్తీ నౌకలో ఉన్న కారి చిన్నయ్యకు చెందిన ఆధార్, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకొన్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆర్ఐ వేణుగోపాలకృష్ణ తెలిపారు.