Share News

Hopes for employmentఉపాధిపై ఆశలు

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:19 AM

Hopes for employment జిందాల్‌ భూముల్లో నిర్మితమయ్యే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎఈ) పరిశ్రమలపై నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధికి తప్పకుండా భరోసా లభిస్తుందని ఆశ పడుతున్నారు. వలస వెళ్లాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం ఉండబోదని భావిస్తున్నారు.

Hopes for employmentఉపాధిపై ఆశలు
భూమి పూజను వీక్షించేందుకు జిందాల్‌ భూముల్లో భారీ స్ర్కీన్‌ ఏర్పాటు చేస్తున్న దృశ్యం

ఉపాధిపై ఆశలు

ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు

జిందాల్‌ భూముల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)పై ఆరా

2023 నవంబర్‌లో ఇండస్ట్రీయల్‌ పార్కుగా మార్పు

అప్పట్లో పది రకాల పరిశ్రమలకు ఆహ్వానం

45వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా

భూ నిర్వాసిత రైతుల ఉద్యమానికి తెర పడినట్లే

రేపు వర్చువల్‌గా భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబునాయుడు

శృంగవరపుకోట, జూలై 2(ఆంధ్రజ్యోతి):

జిందాల్‌ భూముల్లో నిర్మితమయ్యే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎఈ) పరిశ్రమలపై నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధికి తప్పకుండా భరోసా లభిస్తుందని ఆశ పడుతున్నారు. వలస వెళ్లాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం ఉండబోదని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిందాల్‌ యాజమాన్యం ఈ భూముల్లో నెలకొల్పే ఇండస్ట్రీయల్‌ పార్కుల వివరాలను బహిరంగ పరచలేదు. ఇండస్ట్రీయల్‌ కామర్స్‌ డిమార్ట్‌మెంటు నుంచి అనుమతులు పొందిన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టులో మాత్రమే ప్రతిపాదిత ఎంఎస్‌ఎంఈలు కనిపిస్తున్నాయి. ఈ రిపోర్టు కూడా కొంత మంది అధికారులకు అందించడంతో బయటపడింది.

ఒకప్పుడు అల్యూమినియం శుద్ధి కార్మాగారం (రిఫైనరీ, విద్యుత్‌ పవర్‌ ప్లాంటు) నిర్మాణం చేపడతామని చెప్పడంతో 834.66 ఎకరాలు అసైన్డ్‌ భూమి, 151.04 ఎకరాల ప్రభుత్వ భూమి, 180.73 ఎకరాల జిరాయితీ కలిపి మొత్తం 1166.43 ఎకరాలను అప్పట్లో రైతులు అప్పగించారు. ఈ పరిశ్రమను నిర్మించని జిందాల్‌ యాజమాన్యం మూడు సంవత్సరాల క్రితం ఎంఎస్‌ఎంఈల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీయల్‌ పార్కుల పేరుతో అనుమతులు తీసుకుంది. జిందాల్‌ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం నచ్చని భూ నిర్వాసితులు గత ఏడాది జూన్‌ నుంచి రోడ్డెక్కారు. ఈ పరిణామంతో నిరుద్యోగులు డీలా పడ్డారు. ఏడాది కాలంగా నడిచిన వివాదానికి కూటమి ప్రభుత్వం శనివారం ముగింపుపలికింది. భూనిర్వాసితులకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం తరుపున ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత, స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి సమక్షంలో భూ నిర్వాసిత రైతుల తరుపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు హామీ ఇచ్చారు. వివాదం సమసిపోవడంతో నిర్వాసిత రైతులు అనందం వ్యక్తం చేస్తున్నట్లే. స్థానిక నిరుద్యోగ యువత ఉద్యోగాలు వస్తాయని సంబరపడుతోంది. నిర్వాసిత రైతు కుటుంబాలకు చెందిన నిరుద్యోగులతో పాటు జిల్లాలో వివిధ విద్యార్హతలు వున్న నిరుద్యోగులు ఈ భూముల్లో ఏర్పాటు చేయబోయే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల ఏర్పాటుపై చర్చించుకుంటున్నారు.

జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోను ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతోంది. ఎక్కడా 300 ఎకరాల విస్తీర్ణం కంటే ఎక్కువ లేదు. ఎస్‌.కోటలో మాత్రమే ఎక్కువ విస్తీర్ణంలో భూమి కనిపిస్తోంది. రూ.3,970 కోట్ల పెట్టుబడులతో ఈ భూముల్లో నిర్మించనున్న ఇండస్ర్టీయల్‌ పార్కులతో 45వేల మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని జిందాల్‌ డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఆచరణలోకి వస్తే ఈ ప్రాంత ముఖచిత్రం మారుతుందని పరిశీలకులు, విద్యా, పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

2023 నవంబర్‌ 9న జిందాల్‌ (జేఎస్‌డబ్ల్యూ) యాజమాన్యం ఇండస్ర్టీయల్‌ కామర్స్‌ డిపార్ట్‌ మెంట్‌కు సమర్పించిన రిపోర్టులో ప్రతిపాదించిన ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల వివరాలు

---------------------------------------------------------------------------------

పరిశ్రమ పెట్టుబడి (రూ.కోట్లలో) ఉద్యోగాలు(సంఖ్య)

------------------------------------------------------------------------------------

టెక్స్‌టైల్స్‌, అపెరల్స్‌ 1,100 10,000

ఆగ్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ 100 400

ఈవీ బేస్డ్‌ ఈఎంసీ 750 7,500

లిఽథియం బ్యాటరీ రీసైక్లింగ్‌ 300 750

ఇథనాల్‌ తయారీ 160 250

గ్రీన్‌ హైడ్రోజన్‌ 100 150

టోయ్‌ క్లస్టర్‌ 800 12,000

కాయర్‌ క్లస్టర్‌ 10 75

లాజిస్టిక్‌ అండ్‌ వేర్‌ హౌసింగ్‌ 150 2000

ఐటీ సహా ఇతర రంగాలు 500 12,000

-------------------------------------------------------------------------------

మొత్తం 3,970 45,000

-------------------------------------------------------------------------------

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు

ఎంఎస్‌ఎంఈ పార్కు రాకతో ఎస్‌.కోట ముఖచిత్రం మారబోతుంది

ఎమ్మెల్యే లలితకుమారి

శృంగవరపుకోట, జూలై 2(ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో ఎస్‌.కోట ప్రాంత ముఖచిత్రం మారబోతోందని, బొడ్డవర ప్రాంతంలో ఏర్పాటుకాబోయే ఎంఎస్‌ఎంఈ పార్కుల ద్వారా వేలాదిమంది యువతకు ఉద్యోగ, ఉపాధి లభించనుందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ కృషి కీలకమని చెప్పారు. గురువారం ఎస్‌.కోటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇక్కడ జిందాల్‌ పరిశ్రమ వస్తుందని ఈప్రాంత రైతులు ఎంతో నమ్మకంతో సాగుచేసుకుంటున్న భూములు ఇచ్చారని, పరిశ్రమ రాక వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈప్రాంతంలో పరిశ్రమలు రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండునెలల కాలంలోనే ఈప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందన్నారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు శుక్రవారం ఉదయం 9గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారన్నారు. ఇక అన్నిరంగాల్లో ఈప్రాంతం దూసుకుపోతుందన్నారు. విలేకరుల సమావేశం టీడీపీ మండల అధ్యక్షుడు డొకుల అచ్చెంనాయుడు, పీఏసీఎస్‌ చైర్మన్లు జిఎస్‌ నాయుడు, మేడపురెడ్డి శ్రీను, ఏఎంసీ ప్రతినిధులు ఆదిబాబు, చెల్లయ్య, నాయకులు రెడ్డి వెంకన్న,రాయవరపు చంద్రశేఖర్‌,కిరణ్‌,పెదగాడ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇన్నాళ్లకు మోక్షం

ఇండస్ట్రీయల్‌ పార్కుల నిర్మాణానికి కీలక అడుగు

నేడు వర్చువల్‌గా భూమి పూజ చేయనున్న సీఎం

శృంగవరపుకోట జూలై 2 (ఆంధ్రజ్యోతి): శృంగవరపుకోట మండల పరిధిలోని జిందాల్‌ భూములకు ఎట్టకేలకు మోక్షం కలుగనుంది. శుక్రవారం ఉదయం 9గంటలకు కడప జిల్లా జమ్ములమడుగు నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీయల్‌ పార్కుల నిర్మాణానికి వర్చువల్‌గా భూమిపూజ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌ తహసీల్దార్‌ డి.శ్రీనివాసరావుతో కలసి గురువారం పరిశీలించారు. కార్యక్రమాన్ని అహూతులు వీక్షించేందుకు మూడు స్ర్కీన్‌లను యాజమాన్యం ఏర్పాటు చేసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత, ఎంఎస్‌ఎంఈ, సెర్స్‌, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, మరో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, విశాఖ, విజయనగరం పార్లమెంటు సభ్యులు ఎం.శ్రీభరత్‌, కె.అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, డీసీఎంస్‌ చైర్మన్‌ గొంప కృష్ణతో పాటు జిల్లాలోని ఎంఎల్‌ఎలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. జిందాల్‌ పరిశ్రమకు భూములిచ్చిన రైతులు బొడ్డవర గ్రామంలోని ఎమ్మెల్సీ నివాసం నుంచి ర్యాలీగా తరలిరానున్నారు. స్థానిక నిరుద్యోగులు, ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హజరుకావాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరారు.

Updated Date - Jul 03 , 2026 | 12:19 AM