Himakar.. 40th rankహిమకర్.. 40వ ర్యాంక్
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:22 AM
Himakar.. 40th rank దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో బీటెక్ కోర్సులో చేరేందుకు మే 17న మూడు కేంద్రాల్లో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఎక్కువ మందికి వందల్లో జాతీయ స్థాయి ర్యాంకులు వచ్చాయి. బొబ్బిలికి చెందిన కాతా హిమకర్ 40వ ర్యాంక్ సాధించాడు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.90 లక్షల మంది హాజరయ్యారని అంచనా. ఈ పరీక్షలో కనీస మార్కులు సాధించిన వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లకు పోటీ పడాల్సి ఉంటుంది. కాగా ఎక్కువ మంది జిల్లా విద్యార్థులు ఈసారి ఉత్తమ ర్యాంకులు సాధించారు.
హిమకర్.. 40వ ర్యాంక్
జేఈఈ అడ్వాన్స్డ్లో బొబ్బిలి విద్యార్థి సత్తా
అవినాష్ నాయుడుకు 95వ ర్యాంకు
ఉత్తమ ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు
దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో బీటెక్ కోర్సులో చేరేందుకు మే 17న మూడు కేంద్రాల్లో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఎక్కువ మందికి వందల్లో జాతీయ స్థాయి ర్యాంకులు వచ్చాయి. బొబ్బిలికి చెందిన కాతా హిమకర్ 40వ ర్యాంక్ సాధించాడు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.90 లక్షల మంది హాజరయ్యారని అంచనా. ఈ పరీక్షలో కనీస మార్కులు సాధించిన వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లకు పోటీ పడాల్సి ఉంటుంది. కాగా ఎక్కువ మంది జిల్లా విద్యార్థులు ఈసారి ఉత్తమ ర్యాంకులు సాధించారు.
విజయనగరం కలెక్టరేట్/ బొబ్బిలి, జూన్ 1(ఆంధ్రజ్యోతి):
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు జిల్లాలో మూడు కేంద్రాల్లో కలిపి 1463 మంది హాజరయ్యారు. ఎక్కువ మంది మంచి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ - 2026 ఫలితాలను సోమవారం ఐఐటీ రూర్కి ప్రకటించిన విషయం విదితమే. బొబ్బిలికి చెందిన కాతా హిమకర్ జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరిలో 40వ ర్యాంక్ సాధించారు. చదువులో ఆది నుంచి ప్రతిభ కనబరుస్తున్న ఈయన పదో తరగతిలో 600 మార్కులకుగాను 590 సాధించాడు. ఇంటర్లో 1000 మార్కులకుగాను 985 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. తండ్రి కాతా సతీష్గోపాల్ పంచాయతీ కార్యదర్శి, తల్లి వెంకటరత్నం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. హిమకర్ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యాడు. దీంతో జాతీయస్థాయిలో 40వ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. కాగా గంట్యాడ మండలంలోని లక్కిడాం గ్రామానికి చెందిన వాక అవినాష్ నాయుడు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 95వ ర్యాంకు సాధించారు. ఈయన ఇంటర్మీడియట్ విజయవాడలోని శ్రీ చైతన్యలో చదివి 980 మార్కులు కైవసం చేసుకున్నారు. ఐఐటీ ముంబాయిలో సీఎస్ఈ చదవాలని తన లక్ష్యమని అవినాస్ నాయుడు తెలిపారు. తండ్రి వాక చిన్నంనాయుడు, తల్లి సూర్యకళ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. విజయనగరం రింగురోడ్డు ప్రాంతానికి చెందిన ఎర్రమిల్లి సాయికృష్ణ ఆదిత్య ఆల్ ఇండియా స్థాయిలో 538 ర్యాంకు సాధించాడు.
అంతర్జాతీయ కంపెనీకి సీఈవో కావాలని లక్ష్యం
ముంబై ఐఐటీలో చేరి ఉన్నత విద్యనభ్యసించి అంతర్జాతీయ కంపెనీకి సీఈవో కావాలన్నదే నా లక్ష్యం. ఇంటర్లో చేరినప్పటి నుంచి సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చయ్ స్ఫూర్తితో చదివాను. ఉన్నత లక్ష్యం కోసం జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తమ ర్యాంక్ సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేశాను. నా విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే కీలకం.
- కాతా హిమకర్, 40 ర్యాంకర్
సుధీర్కు 154వ ర్యాంకు
బొబ్బిలి రూరల్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): నారసింహునిపేటకు చెందిన మర్రాపు సుధీర్కుమార్ జేఈఈ అడ్వాన్స్డ్లో 154వ ర్యాంకు సాధించాడు. విజయవాడ శ్రీచైతన్యలో ఇంటర్ పూర్తిచేశాడు. 975 మార్కులు సాధించాడు. సుధీర్ తండ్రి చంద్రశేఖర్ ఫార్మా కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తుండగా తల్లి అనురాధ గృహిణిగా ఉన్నారు.
నరేంద్రకు 435, సూర్యవివేక్కు 475వ ర్యాంకు
రేగిడి, జూన్ 1,(ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్డ్లో రేగిడి మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఒప్పంగి గ్రామానికి చెందిన అల్లు నరేంద్ర ఆల్ ఇండియా స్థాయిలో 435వ ర్యాంక్ సాధించాడు. ఈయన తండ్రి గణపతినాయుడు లెక్చరర్గా పనిచేస్తున్నారు. తల్లి సుజాత గృహణి. వీరికి ఇద్దరు పిల్లలు కాగా పెద్ద అబ్బాయి నరేంద్ర. కాగా బూరాడ గ్రామానికి చెందిన గులివిందల సూర్యవివేక్ నాయుడు ఆల్ఇండియా కేటగిరిలో 475వ ర్యాంక్తో మెరిసాడు. ఈయన తండ్రి సెక్రటరీ కాగా తల్లి పుణ్యవతి గృహిణిగా ఉన్నారు. ఐఐటీ పూర్తి చేసి భవిష్యత్లో సివిల్ సర్వీస్లో స్థిరపడాలనుకుంటున్నట్లు సూర్యవివేక్ తెలిపారు.
కౌశిక్కు 345వ ర్యాంకు
రాజాం జూన్ 1 (ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్డ్లో రాజాంకు చెందిన సతివాడ కౌశిక్ ఓపెన్ కేటగిరిలో 345వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు మజ్జి సునీత, సతివాడ హరిబాబులు ఇద్దరు ఉపాధ్యాయులే. 10వ తరగతి నుండి ఇంటర్ వరకు విశాఖ చైతన్యకళాశాలలో చదువుకున్నాడు. కాగా రాజాంకు చెందిన పాలవలస బార్గవనాయుడు ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 270వ ర్యాంకు సాధించాడు. తండ్రి పాలవలస అప్పలరాజు టీచరు కాగా తల్లి ఉషారాణి కూడా టీచర్గానే పనిచేస్తున్నారు.
జ్ఞానేందర్కు 630వ ర్యాంకు
నెల్లిమర్ల, జూన్ 1(ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్డ్లో నెల్లిమర్ల మండలం గొర్లెపేట గ్రామానికి చెందిన కోరాడ జ్ఞానేందర్కు 630 ర్యాంకు వచ్చింది. తల్లి నాగమణి గృహిణి కాగా తండ్రి కోరాడ వెంకటరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గుర్ల మండలం కొండ గండ్రేడులో పనిచేస్తున్నారు.