పాతకక్షలతోనే హరినాథ్ హత్య
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:07 AM
: విజయనగరం పట్టణం జొన్నగుడ్డి ప్రాంతానికి చెందిన పావాడ హరినాథ్ (23) అనే యువకుడిని ఐదుగురు వ్యక్తులు పాతకక్షలతో హత్య చేసినట్టు ఫిర్యాదు అందిందని.
విజయనగరం క్రైం,ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): విజయనగరం పట్టణం జొన్నగుడ్డి ప్రాంతానికి చెందిన పావాడ హరినాథ్ (23) అనే యువకుడిని ఐదుగురు వ్యక్తులు పాతకక్షలతో హత్య చేసినట్టు ఫిర్యాదు అందిందని... ఈ మేరకు విచారణ జరుగుతోందని వన్టౌన్ సీఐ ఆర్వీ ఆరేకే చౌదరి తెలిపారు. తన కుమారుడు హరినాథ్ కనిపించడం లేదని అతని తల్లి సంతోషి ఈనెల 10న ఫిర్యాదు చేశారని తెలిపారు. మరునాడు మళ్లీ ఆమె వచ్చి జమ్ము నారాయణపురం సమీపంలోని నేలబావిలో తన కుమారుడి మృతదేహం ఉన్నట్టు మరో ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. జొన్నగుడ్డికి చెందిన లక్ష్మణ, వాసు, తేజ, మరికొందరు కలసి తన కుమారుడిని చంపి నేలబావిలో పడేసినట్టు హరినాఽథ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు. ఐదుగురి ప్రమేయం ఉన్నట్టు తమ విచారణలో తేలిందని సీఐ చౌదరి చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా.. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హరినాఽథ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అశోక్ బంగ్లా నుంచి ర్యాలీగా నినాదాలు చేస్తూ వన్టౌన్ పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. నిందితులపై తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. మృతుడితో పాటు, ఇద్దరు నిందితులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిసింది.