Graceful… A Grand Wedding కమనీయం.. కల్యాణం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:39 AM
Graceful… A Grand Wedding జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. రామ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. వాడవాడలా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. మేళతాళాలు.. వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
తోటపల్లిలో మార్మోగిన శ్రీరామ నామస్మరణ
భారీగా భక్తుల హాజరు
వాడవాడలా నవమి వేడుకలు
గరుగుబిల్లి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. రామ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. వాడవాడలా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. మేళతాళాలు.. వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల్లో శుక్రవారం సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ఉభయ దేవస్థానాల పరిధిలో శ్రీరామ సుప్ర భాత సేవ, ఆరాధన, మంగళాశాసనములు, రక్షా బంధనం, అంకురారోపణము నిర్వహించారు. శ్రీరామలక్ష్మి మంత్ర జపాలను పఠించారు. అనంతరం ప్రధాన అర్చకులు వీవీ అప్పలాచార్యులు, ఎం. రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు నడుమ శాస్ర్తోక్తంగా రాములోరి కల్యాణాన్ని జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు ఈ మహోత్సవాన్ని ఆధ్యంతం తిలకించి పరవశించిపోయారు. మొత్తంగా ప్రాంగణమంతా జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. కల్యాణానికి తరలివచ్చిన భక్తులకు దేవస్థానం సిబ్బంది ప్రసాదాలను అందించారు. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో బి.శ్రీనివాస్, చైర్మన్ ఎం.పకీరునాయుడు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు. తోటపల్లి దేవస్థానాల అభివృద్ధి సేవా ట్రస్ట్ ఆధ్వర్వంల భక్తులకు ఉచిత అన్నసమారాధన నిర్వహించారు.