Share News

Development సుపరిపాలనతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:41 PM

Good Governance Is the Key to Development నిబద్ధత, సమర్థవంతమైన సుపరిపాలనతోనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం పార్వతీపురం ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

 Development సుపరిపాలనతోనే అభివృద్ధి సాధ్యం
మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నిబద్ధత, సమర్థవంతమైన సుపరిపాలనతోనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం పార్వతీపురం ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు తమ జాబ్‌చార్టుపై పూర్తిగా అవగాహన కలిగి ఉండా లన్నారు. భావోద్వేగాలకు తావు లేకుండా చట్టం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని సూచిం చారు. గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కరించి.. ప్రజలు ఉన్నతాధికారుల కార్యాలయాల చట్టూ తిరగకుండా చూడాలన్నారు. రీసర్వేను శాస్ర్తీయ పద్ధతిలో విజయవంతం చేయాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ వినతుల పరిష్కారంలో నాణ్యత పాటించాలని సూచించారు. 22ఏ నిషేధిత జాబితా సమస్యలను రెవెన్యూ క్లినిక్‌ ద్వారా వేగంగా పరిష్కరించాలన్నారు. ఆర్‌వోఆర్‌ చట్టంపై అధికారులు పట్టుసాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, ఆర్డీవో మాధురి, తహసీల్దార్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు.

- సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం అధికారులు బాధ్యత అని కలెక్టర్‌ అన్నారు. ఉపాధి హామీ పథకంలో వంద శాతం సబ్సిడీతో మొక్కల పెంపకానికి అవకాశం ఉందని, జాబ్‌కార్డు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, పశుగ్రాసం, గ్రామీణ ఉపాధి పెంపునకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి

స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, హర్‌ఘర్‌తిరంగా కార్యక్రమాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా ఆరోగ్యశాఖకు ప్రథమ ర్యాంకు

రాష్ట్రస్థాయి ప్రాథమిక ఆరోగ్య సమీక్షలో మన్యం జిల్లాకు ప్రథమర్యాంకు లభించడంపై కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ఏదేమైనా జిల్లాను రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలపడం.. అధికారుల సమష్టి కృషికి నిదర్శనమన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 11:41 PM