Railway Projects రైల్వే ప్రాజెక్ట్లకు మహర్దశ
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:06 AM
Golden Phase for Railway Projects ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైల్వే ప్రాజెక్ట్లకు మహర్దశ పట్టనుంది. పెండింగ్తో పాటు కొత్త ప్రాజెక్ట్లకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
పార్వతీపురం/సాలూరు రూరల్, ఫిబ్రవరి2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైల్వే ప్రాజెక్ట్లకు మహర్దశ పట్టనుంది. పెండింగ్తో పాటు కొత్త ప్రాజెక్ట్లకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రైల్వే ట్రాఫిక్ పెరగడంతో విజయనగరం జంక్షన్ స్టేషన్కు రూ. 100 కోట్లతో 14 కిలోమీటర్ల బైపాస్ డబుల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. పార్వతీపురం జిల్లా మీదుగా విజయనగరం నుంచి ఒడిశాలో టిట్లాగర్కు రూ.2575 కోట్లతో 264.60 కిలోమీటర్లు త్రిబుల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మీదుగా విజయనగరం నుంచి ఒడిశాలో భద్రక్కు రూ.4962.87 కోట్లతో 525 కిలోమీటర్లు త్రిబుల్ లైన్ నిర్మిస్తారు. కొత్తవలస నుంచి ఒడిశాలో కోరాపుట్కు రూ.3332.94 కోట్లతో 189.28 కిలోమీటర్ల డబుల్ లైన్ నిర్మించ నున్నారు. కొత్తవలస నుంచి విజయనగరం జంక్షన్కు 2023-2024 బడ్జెట్లో మంజూరై పెండింగ్లో ఉన్న 34.70 కిలోమీటర్ల థర్డ్ లైన్, ఫోర్త్ లైన్లు ఏర్పాటుకు రూ.793 కోట్లు వెచ్చించనున్నారు.