దైవ దర్శనానికి వెళ్లి..
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:55 PM
గార మండలం వత్సవలస గ్రామంలో రాజులమ్మతల్లి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.రమేష్ దుర్మరణం చెందగా భార్య సుజాత, కుమార్తె ధాత్రిశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి.
బుడుమూరు వద్ద రోడ్డు ప్రమాదం
ఒకరు దుర్మరణం
ఇద్దరికి తీవ్ర గాయాలు
లావేరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గార మండలం వత్సవలస గ్రామంలో రాజులమ్మతల్లి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.రమేష్ దుర్మరణం చెందగా భార్య సుజాత, కుమార్తె ధాత్రిశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా దాకమర్రి గ్రామానికి చెందిన రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి వత్సవలస రాజులమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయా ణంలో స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా బుడుమూరు వద్ద టెక్కలి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన సుజాత, ధాత్రిశ్రీలను హైవే అంబులెన్స్ లో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రమేష్ మృత దేహాన్ని పోస్టుమార్టానికి రిమ్స్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు ఎస్ఐ కేఏ సూరి తెలిపారు.