For so many years! ఎన్నాళ్లకెన్నాళ్లకు!
ABN , Publish Date - May 17 , 2026 | 11:55 PM
For so many years! బొబ్బిలి ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెలవేరనుంది. దశాబ్దాల పాటు పుర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే పథకం పట్టాలెక్కనుంది. గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పడకేసిన పనులు మొదలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
పట్టాలెక్కనున్న బొబ్బిలి తాగునీటి పథకం
ఆగిపోయిన పనులకు త్వరలో కదలిక
గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
సువర్ణముఖి నది నుంచి నీళ్లు
పెరిగిన అంచనా వ్యయం
బొబ్బిలి ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెలవేరనుంది. దశాబ్దాల పాటు పుర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే పథకం పట్టాలెక్కనుంది. గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పడకేసిన పనులు మొదలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే బేబీనాయన అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించాక కదలిక వచ్చింది. తాగునీటి పథకం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సువర్ణముఖి నది నుంచి తాగునీరు ఇచ్చే ఈ పథకం అంచనా వ్యయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
బొబ్బిలి, మే 17 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి పట్టణ ప్రజలకు రాబోయే రెండు, మూడు దశాబ్దాల వరకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక చొరవతో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) పథకం కింద రూ.90 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును మంజూరు చేయించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలోని సువర్ణముఖి నది నుంచి బొబ్బిలికి తాగునీరు అందించాలనేది పథకం లక్ష్యం. ఇందులో భాగంగా బొబ్బిలి ఐటీఐ కాలనీ, స్వామివారివీధి, రాజానగర్ కాలనీ, పోలీసుస్టేషన్ సమీపంలో నాలుగు రిజర్వాయర్లను ప్రతిపాదించారు. ఐటీఐ కాలనీ దగ్గర రిజర్వాయరు నిర్మాణం పనులు ప్రారంభించారు కానీ పునాది స్ధాయిలోనే నిలిచిపోయాయి. 2019 ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి గ్రహణం పట్టినట్లయింది. కేంద్రప్రభుత్వ పథకానికి రాష్ట్ట్రవాటాను చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు కదలిక వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే బేబీనాయన పలు దఫాలు అసెంబ్లీలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి నారాయణకు విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించారు. నిధుల విడుదలకు ఇటీవల గ్రీన్సిగ్నల్ రావడంతో పథకం పనులను మళ్లీ ప్రారంభించేందుకు టెండర్లను ఖరారు చేశారు.
పెరిగిన అంచనా వ్యయం
రూ.90 కోట్లు ఉండే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.133.32 కోట్లకు పెరిగింది. పాత కాంట్రాక్టు ఏజెన్సీకే పనులు మంజూరు కావడంతో ఆగిపోయిన చోట ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల పబ్లిక్హెల్త్ ఎస్ఈ జ్యోతి, కాంట్రాక్టు ఏజన్సీ ప్రతినిధులు, మున్సిపల్ కమిషనరు లాలం రామలక్ష్మి, ఇంజనీరింగ్ అధికారులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని సత్వరం అమలు చేసేలా ఎటువంటి జాప్యం లేకుండా పనులను అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
ఫ బొబ్బిలి పట్టణానికి భోజరాజపురం వేగావతి నది నుంచి 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి పథకం ప్రజల తాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతోంది. పెద్దగెడ్డ రిజర్వాయరునుంచి అధికారులు కరుణిస్తేనే ఏటా వేసవిలో తాగునీరు లభ్యమవుతోంది. అయినప్పటికీ రోజు విడిచి రోజు పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు.