ఆర్థిక ప్రమాణాలు పెంచాలి
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:59 PM
ప్రతి పంటకూ ఎకరానికి గత ఏడాది కంటే 8 శాతం అధికంగా ఆర్థిక ప్రమాణాలు ఉండేలా జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ స్కేల్స్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా సిఫారసు చేయాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి డీసీసీబీ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ ప్రభాకర్రెడ్డి
పార్వతీపురం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రతి పంటకూ ఎకరానికి గత ఏడాది కంటే 8 శాతం అధికంగా ఆర్థిక ప్రమాణాలు ఉండేలా జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ స్కేల్స్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా సిఫారసు చేయాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి డీసీసీబీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రుణాల మంజూరుకు అవసరమైన నిధులను నిర్ణయించడంలో కమిటీ సహాయపడాలని అన్నారు. జిల్లాలో వరి, చెరకు, అరటి, వేరుశనగ కంది, ఎండుమిర్చి, జూట్, పసుపు, ఇతర పండ్ల సాగు రైతులకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఆర్థిక ప్రమాణాల్లో 8 శాతం వృద్ధి ఉండేలా సిఫారసు చేయాలని, ఆదిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్కుమార్రెడ్డి, డీసీసీబీ సీఈవో ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లాస్థాయి నృత్య పోటీలు
మన్యం కళావేదిక ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలను మంత్రి సంధ్యారాణి ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ పోటీల్లో సినిమా పాటల నృత్యాలకు అనుమతి లేదన్నారు. కేవలం గిరిజన, జానపద, దేశభక్తి నృత్యాలను మాత్రమే ప్రదర్శించాలని పేర్కొన్నారు.