ఏజెన్సీలో జ్వరాలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:20 AM
ఏజెన్సీలో గిరిజనులు జ్వరాలతో బాధపడుతున్నారు.
సరిపడే బెడ్స్ లేక వరండాలోనే వైద్యసేవలు
పాచిపెంట రూరల్, జూలై 20 (ఆంధ్ర జ్యోతి): ఏజెన్సీలో గిరిజనులు జ్వరాలతో బాధపడుతున్నారు. కేరంగి, తుమరావల్లి గుమ్మడిగూడ, సురగడగవలస, నీలమ్మవలస, కటారికోట, భీమన్నదొరవలస, మోదుగు పొలుమువలస, బంగారుగుడ్డి, బుచ్చింపాడు, అడారిపాడు తదితర గ్రామాల్లోని గిరిజనులు సీజనల్ జ్వరాల బారినపడ్డారు. గురువునాయుడుపేట, పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సోమవారం జ్వర పీడితులు ఆశ్రయించారు. జ్వరంతో బాధపడుతున్న వారిలో గుమ్మడిగూడకు చెందిన మజ్జి సతీష్, సురగడ వలసకు చెందిన సీదరి అను, పిండ్రంగి వలసకు చెందిన ఎస్.జ్ఞానేష్, కొటికిపెంట కు చెందిన ఎ.తిరుపతి రావు, పి.కోనవలస గ్రామానికి చెందిన కె.గణేశ్ ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది, జలుబు, దగ్గు ఇతర చిన్న చిన్న రోగాలతో బాధపడుతూ పీహెచ్సీలకు తరలివచ్చారు. ఆయా పీహెచ్సీల్లో సరిపడే బెడ్స్ లేక రోగులు ఇబ్బంది పడ్డారు. వరండాలో బెంచీలపై వైద్యసేవలు పొందాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 82, గురువునాయుడుపేట పీహెచ్సీలో 42 ఓపీ నమోదైంది. వైద్యాధికారులు హర్షిత, సురేష్ చంద్రదేవ్ రోడులకు సేవలు అందించారు. సాధారణ జ్వరాలేని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.