Share News

Festive Cheer మన్యానికి పండుగ కళ

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:13 AM

Festive Cheer Returns to the Agency Area ‘మన్యం’లో పండుగ కళ తొణికిసలాడుతోంది. అందరి లోనూ సంక్రాంతి జోష్‌ నెలకొంది. గురువారం పెద్దల పండుగను వైభవంగా జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Festive Cheer   మన్యానికి పండుగ కళ
గంగిరెద్దుతో జంగందేవర

  • ఉత్సాహంగా భోగి మంటలు

  • నేడే మకర సంక్రాంతి

  • పూజలకు జిల్లావాసులు సిద్ధం

పార్వతీపురం, జనవరి14(ఆంధ్రజ్యోతి): ‘మన్యం’లో పండుగ కళ తొణికిసలాడుతోంది. అందరి లోనూ సంక్రాంతి జోష్‌ నెలకొంది. గురువారం పెద్దల పండుగను వైభవంగా జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తమ పూర్వీకులను పూజించి ఆపై కొత్త దుస్తులతో ముస్తాబవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే చుట్టాలు, బంధువులు, స్నేహితులతో ప్రతి ఇల్లు కళకళలాడుతోంది. చిన్నారులు సందడి చేస్తున్నారు. యువకులు కేరింతలు కొడుతున్నారు. ఆటలు, పాటలతో ఆకట్టుకుంటున్నారు. గాలిపటాలు ఎగరేస్తున్నారు. యువతులు ముంగిళ్లకు రంగురంగుల రంగవల్లులతో కొత్తదనాన్ని తీసుకొచ్చారు. ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి సంప్రదాయాలను అనుసరించారు. మరోవైపు సంక్రాంతి చుట్టాలుగా ప్రతి ఇంటికీ వచ్చే హరిదాసులు, డూడూ బసవన్నల హడావుడి అంతా ఇంతా కాదు. వీరిని అందరూ అనుసరిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. కాగా బుధవారం కూడా పార్వతీపురం, పాల కొండ, సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ కిటకిటలాడాయి. త్వరగా స్వగ్రామాలకు చేరుకో వాలన్న ఉత్సాహం ప్రయాణికుల్లో కనిపించింది. పండుగకు కావాల్సిన పిండివంటల సామగ్రి, పూజా సామాన్ల కొనుగోలుతో మార్కెట్లన్నీ కిటకిటలాడాయి. దుస్తుల షాపులది మరింత ప్రత్యేకం. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల్లో వ్రస్త వ్యాపారం జరిగింది. కోడి పందేలు కూడా గుట్టుగా జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా పందేలు జరిగే స్థలం నిర్ణయించుకుంటున్నారు. పందేలకు దిగేవారు తప్పితే ఇతరులకు ఈ సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటు న్నారు. అయితే పోలీసులు కూడా గట్టి నిఘా పెట్టారు. డ్రోన్‌లతోనూ పర్యవేక్షిస్తున్నారు.

భోగి కాంతులు

జిల్లావాసులు బుధవారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఉదయాన్నే పిల్లలు, పెద్దలు కలిసి వీధుల్లో భోగి మంటలు వేశారు. అందులో పిడకలు, కర్రలు, కట్టెలు, పాత మంచాలు, విరిగిన కుర్చీలను వేశారు. కొన్నిచోట్ల యువత మంగళవారం అర్ధరాత్రి నుంచే సందడి చేశారు. రాత్రంతా మేలుకుని మంటలు వేసేందుకు ఉత్సాహం చూపించారు. మరోవైపు మహిళలు ఇళ్ల ముందు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. చిన్నారులకు సూర్యాస్తమయం లోపు భోగి పండ్లు వేశారు. వారిని సంప్రదాయ దుస్తులతో ముస్తాబు చేశారు. మరోవైపు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల వారు, జంగందేవరలతో పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి.

Updated Date - Jan 15 , 2026 | 12:13 AM