ప్రాణం తీసిన అతివేగం
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:18 AM
ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన పారసిల్లి నర్సింగరావు (24) రహదారి ప్రమాదంలో గత నెల 17న మృతి చెందిన ఘటన 13 రోజుల తర్వాత మంగళవారం వెలుగులోకి వచ్చింది.
13 రోజుల తర్వాత యువకుడి మృతదేహం వెలుగులోకి..
గరుగుబిల్లి, జూన్ 30 (ఆంధ్రజ్యో తి): ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన పారసిల్లి నర్సింగరావు (24) రహదారి ప్రమాదంలో గత నెల 17న మృతి చెందిన ఘటన 13 రోజుల తర్వాత మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్ఐ షేక్ ఫకృద్ధీన్ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 17న తోటపల్లి దేవస్థానం నుంచి ఖడ్గవలస వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్న నర్సింగరావు కుదమ మట్టిరోడ్డు సమీ పంలో మలుపు వద్ద అతి వేగం కారణంగా బైక్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనికి వెంటనే వైద్య సహాయం అందకపోవడంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం పొదల్లో ఉండటంతో ఈ ఘటన ఎవరి దృష్టికి రాలేదు. మంగళవారం ఆ ప్రాంతంలో దుర్గంధం వ్యాపించడంతో స్థానికులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. బైక్ రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా మృతుడి వివరాలను గుర్తించిన పోలీసులు రాయగడలోని కుటుంబ సభ్యులకు సమా చారాన్ని అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.