భూగర్భ జలాలు పెరిగేలా చూడండి: కలెక్టర్
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:06 AM
జిల్లాలోని జలధార-నీటి భద్రత కింద చేపడుతున్న పనులతో భూగర్భ నీటి మట్టం పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు.
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జలధార-నీటి భద్రత కింద చేపడుతున్న పనులతో భూగర్భ నీటి మట్టం పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జలధార-నీటి భద్రతపై మండల స్దాయి అధికారులతో సమీక్షించారు. జలధార కింద 215 ప్రాధాన్య గ్రామాల్లో 1,679 చెరువుల పనులకు అంచనాలు తయారు చేయాలన్నారు. ఈ గ్రామాల్లో భూగర్భ జల మట్టాలు పెరిగేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న 8,010 చెరువుల పనులను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఆర్డీవో సత్తిబాబు, జలవనరుల ఈఈ ఎంవీ రమణ, డీఈ గోవిందరావు, డ్వామా పీడీ శారదాదేవి పాల్గొన్నారు.
త్వరగా పూర్తి చేయాలి
ఎంపి లాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఎంపీ లాడ్స్ పనుల ప్రగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ నిధులతో మంజూరైన పనులు వివిధ దశల్లో పెండింగ్లో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. విజయనగరంలో 68 పనులు, విశాఖ ఎంపీ నుంచి నాలుగు, ముగ్గురు రాజ్యసభ సభ్యులకు సంబంధించి 8 పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో సీపీవో బాలాజీ, ఏపీఈపీడిసిఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రీ సర్వే ప్రక్రియ...
జిల్లాలో భూములు రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. తన కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని తప్పులు లేని పాసు పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు.