Devotees భక్తులకు అసౌకర్యం కలగనీయొద్దు
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:13 AM
Ensure No Inconvenience to Devotees ఆలయాల వద్ద భక్తులకు అసౌకర్యం కలగనీయకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
కొమరాడ, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఆలయాల వద్ద భక్తులకు అసౌకర్యం కలగనీయకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం గుంప సోమేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులకు స్వామి దర్శనం సాఫీగా అయ్యేలా చూడాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు ఇతర ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కూనేరు వద్ద చెక్పోస్టును పరిశీలించారు. ప్రతి వాహనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేయాలన్నారు.
పారమ్మ కొండ వద్ద ఏర్పాట్ల పరిశీలన
పాచిపెంట: పారమ్మ కొండ వద్ద ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ పాటించాలన్నారు. సాయంత్రం భక్తులను కొండపైకి ఎక్కని వ్వొద్దని సూచించారు. తోపులాట జరగకుండా చూసుకోవాలన్నారు. తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించాలని పోలీసులకు సూచించారు. ఈ పరిశీలనలో ఏఎస్పీ మనీషారెడ్డి తదితరులు ఉన్నారు.