ఎElections? Extension? న్నికలా? పొడిగింపా?
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:02 AM
Elections? Extension? గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఐసీ (పర్సన్ ఇన్చార్జి)లను ప్రభుత్వం కొనసాగిస్తుందా? తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుందా? అన్న దానిపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో పశు సంవర్ధక శాఖాధికారులు తర్జన, భర్జన పడుతున్నారు.
ఎన్నికలా? పొడిగింపా?
అయోమయంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు
ప్రభుత్వం నుంచి రాని ఉత్తర్వులు
ఎన్నికలకు పశు సంవర్థకశాఖ ఏర్పాట్లు
విజయనగరం రూరల్, ఫిబ్రవరి 16 ( ఆంధ్రజ్యోతి): గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఐసీ (పర్సన్ ఇన్చార్జి)లను ప్రభుత్వం కొనసాగిస్తుందా? తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుందా? అన్న దానిపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో పశు సంవర్ధక శాఖాధికారులు తర్జన, భర్జన పడుతున్నారు. విజయనగరం జిల్లాలో 87 సంఘాలు, పార్వతీపురం మన్యంలో 33 సంఘాలు ఉన్నాయి. వీటి పాలకవర్గాల పదవీ కాలం గత ఏడాది జూన్, 23తో ముగిసింది. పాలకవర్గాల స్థానంలో పీఐసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పీఐసీలు ఆరు నెలల పాటు ఉంటాయి. వాటి గడువు గత నెల 22తోనే ముగిసింది. మరోసారి గడువు పెంచుతూ కాని, ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై కాని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు.
జిల్లా స్థాయిలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘ అధ్యక్షుడి పదవీ కాలం ముగియడంతో అప్పటివరకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన మన్యాల కృష్ణనే తిరిగి పీఐసీగా నియమించారు. గత నెల 22తో పీఐసీ గడువు ముగిసింది. పర్సన్ ఇన్చార్జిల పదవీ కాలం ముగిసిందని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం ముందుకువెళ్తామని లిఖితపూర్వకంగా, మౌఖికంగా కూడా పశు సంవర్థకశాఖాధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు వివరించారు. గత నెల 20నే విజయనగరం జిల్లా పశు సంవర్థకశాఖాధికారులు ఫైల్ పంపినా ఇంత వరకూ సమాచారం రాలేదు.
- క్షేత్రస్థాయిలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘ ఎన్నికలకు సంబంధించి పశు సంవర్థకశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు నిర్వహించాలంటే ప్రతి సంఘం నుంచి రికార్డులు జిల్లా పశు సంవర్థకశాఖ కార్యాలయానికి చేరాలి. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 120 సంఘాలకు గాను ఇప్పటి వరకూ 90 శాతం సంఘాలకు సంబంధించిన వివరాలు, రికార్డులు అందాయి. మిగతా పది శాతం రావాల్సి ఉంది. ఎన్నికలపై ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారులు ముందుకు వెళ్లనున్నారు.