E-Crop ఈ-పంట నమోదు తప్పనిసరి
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:15 AM
E-Crop Registration Made Mandatory ప్రభుత్వ రాయితీలు అందాలంటే ఈ-పంట నమోదు తప్పనిసరి అని జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్ అన్నారు. శనివారం ఏవో టి.జ్యోత్స్న ఆధ్వర్యంలో గరుగుబిల్లిలో జరుగుతున్న ఈ-పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు.
గరుగుబిల్లి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రాయితీలు అందాలంటే ఈ-పంట నమోదు తప్పనిసరి అని జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్ అన్నారు. శనివారం ఏవో టి.జ్యోత్స్న ఆధ్వర్యంలో గరుగుబిల్లిలో జరుగుతున్న ఈ-పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. రైతులు విధిగా ఈ-పంట నమోదు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ, భూసార పరిరక్షణ ధ్యేయంగా గట్టు మీద చెట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పొలం గట్లుపై పెంచే మొక్కల ద్వారా రైతులకు భవిష్యత్లో అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఎరువుల నిల్వలు, విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు అక్రమంగా ఎరువులను తరలించినా సంబంధిత వ్యవసాయాధికారులకు వెంటనే సమాచారం అందించాలని రైతులకు సూచించారు. అనంతరం పీఏసీఎస్లో ఎరువుల నిల్వలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ సిబ్బందికి పలు సూచన లిచ్చారు. ఈ పరిశీలనలో అగ్రికల్చర్ అసిస్టెంట్ కె.అనూష, పీఏసీఎస్ సిబ్బంది బి.రవికుమార్, తదితరులు ఉన్నారు.