Easily... quickly! సులువుగా.. వేగంగా!
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:08 AM
Easily... quickly! రిజిస్ర్టేషన్ సేవలు ఇక మరింత సులభతరం కానున్నాయి. అవినీతికి అవకాశం లేకుండా త్వరితగతిన సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకూ భూ క్రయ విక్రయదారులు ముందుగా దస్తావేజు లేఖర్లను ఆశ్రయిస్తుండేవారు.
సులువుగా.. వేగంగా!
రిజిస్ట్రేషన్లు అయ్యేలా ప్రభుత్వం చర్యలు
తెరపైకి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)
ప్రతి జిల్లా కేంద్రంలో పీపీపీ విధానంలో నిర్వహణ
ఆపై అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరణ
రిజిస్ర్టేషన్ సేవలు ఇక మరింత సులభతరం కానున్నాయి. అవినీతికి అవకాశం లేకుండా త్వరితగతిన సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకూ భూ క్రయ విక్రయదారులు ముందుగా దస్తావేజు లేఖర్లను ఆశ్రయిస్తుండేవారు. ఇకపై వారి అవసరం లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్ సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జిల్లా కేంద్రంలోనూ, ఆ తర్వాత సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రిజిస్ర్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. తక్కువ రుసుంతో దస్తావేజుల తయారీతో పాటు రిజిస్ర్టేషన్ పూర్తిచేసుకునే వెసులుబాటు కలగనుంది.
శృంగవరపుకోట/రాజాం, ఆగస్టు5 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లు (దస్తావేజు లేఖర్లు) ఆందోళన చేస్తుండడంతో భూములు, ఇతర ఆస్తుల క్రయ, విక్రయాలు నిలిచిపోకుండా రిజిస్ర్టేషన్లు, స్టాంపుల శాఖ అప్రమత్తమైంది. ఎప్పటిలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు జరుగుతున్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా ఐజీ అంబేడ్కర్ చర్యలు చేపట్టారు. దస్తావేజు లేఖర్ల ఆందోళనతో సంబంధం లేదని సబ్ రిజిస్ట్రార్లు కూడా ప్రకటనలు విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల మినహా అన్ని జిల్లాలోనూ వీటిని అమలు చేసేందుకు జూన్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుతున్న పౌరసేవలను మరింత మెరుగ్గా పారదర్శిక, సాంకేతికత ఆధారిత రిజిస్ర్టేషన్ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పాటు మధ్యవర్తులపై ఆధారపడడం తగ్గించేందుకు పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ (పీడీఈ)ను అందుబాటులోకి తీసుకువస్తోంది. చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ విఽధులను ప్రభుత్వ నియంత్రణలో ఉంచుతూ సేవానాణ్యతను పెంచి ప్రజల విశ్వాసం పొందేందుకు చూస్తోంది.
ఈ సేవలు అందించేందుకు ఒక్కో డాక్యుమెంటు(పత్రం) గరిష్టంగా రూ.2వేలు వసూలు చేయనున్నారు. ఈ విధానం ఇప్పటికే మహారాష్ట్రతో పాటు ఇతర చోట్ల అమలవుతోంది. అక్కడ ఒక్కో డాక్యుమెంటుకు రూ.5,200 వరకు వసూలు చేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ విధానంతో తమకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయంతో జిల్లాలోని డాక్యుమెంటు రైటర్లు (దస్తావేజులేఖర్లు) సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టారు. భూములు, వివిధ ఆస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంటులు (దస్తావేజు పత్రాలు) తయారు చేయడం మానేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూములు, ఆస్తుల క్రయ, విక్రయాలకు అటంకం ఉంటుందన్న అనుమానంతో కొనుగోలు, అమ్మకందారులు వున్నారు. దీన్ని గుర్తించిన స్టాంపులు, రిజిస్టేషన్ల శాఖ ఐజీ అంబేడ్కర్ ఆస్తుల క్రయ, విక్రయాలు, ఇతర అధికారిక కార్యకలాపాలు సాఫీగా సాగేలా చూడాలని సబ్ రిజిస్ట్రార్లకు సూచించారు. ప్రజల్లో వున్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికీ రైటర్ల సహకారంతోనే..
రిజిస్ట్రేషన్ల కోసం డాక్యుమెంటు రైటర్ల సహకారం తీసుకోక తప్పడం లేదు. అలా అయితేనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తొందరగా పని జరుగుతోంది. లేదంటే రోజులు, వారాలు పడుతోంది. గట్టిగా అడిగితే ఏదో ఒక తప్పు చూపించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి డాక్యుమెంటును తిరిగి పంపించేస్తున్నారు. ఈ బాధలన్నీ పడలేని క్రయ, విక్రయదారులు డాక్యుమెంటు రైటర్ల గడపతొక్కుతున్నారు. అడిగినంత ఇచ్చుకుంటున్నారు. అయితే ప్రభుత్వమిప్పుడు రిజిస్ర్ట్రేషన్ సేవా కేంద్రాలను అందుబాటులోకి తెస్తుండడం, డాక్యుమెంటుకు గరిష్టంగా రూ.రెండు వేల ధర నిర్ణయించడంతో మధ్యవర్తిత్వ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
--------------