నేరాల నియంత్రణకు డ్రోన్ పోలిసింగ్
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:17 PM
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, నేరాల నియంత్రణకు, మాదవద్రవ్యాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రోన్ పోలిసింగ్ నిర్వహించాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశించారు.
- ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో నిర్వహించాలి
- పెండింగ్ కేసులను త్వరితగతిన దర్యాప్తు చేయాలి
-ఎస్పీ మాధవరెడ్డి
బెలగాం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, నేరాల నియంత్రణకు, మాదవద్రవ్యాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రోన్ పోలిసింగ్ నిర్వహించాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పీఎస్ పరిధిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి బాఽధితులకు న్యాయం చేయాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రజలకు కనబడేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ-చలానా, డ్రంకెన్ డ్రైవ్పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, సారా నివారణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మహిళా సంబంధిత నేరాల కేసుల దర్యాప్తును త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దర్యాప్తులో సాంకేతికతను జోడించి పెండింగ్ కేసులను త్వరతిగతిన పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ కేసులపై ఆరా తీసి వాటి పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు చేశారు. పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రతి కేసు వివరాలను క్షుణ్ణంగా సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. సైబర్ నేరాలు, శక్తి యాప్, మత్తు పదార్ధాల వినియోగంతో కలిగే అనర్ధాల గురించి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషా వంగలరెడ్డి, డీఎస్పీ రాంబాబు, డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్బీ సీఐ రమణమూర్తి, సైబర్ సెల్ సీఐ తదితరులు పాల్గొన్నారు.