Studies చదువును నిర్లక్ష్యం చేయొద్దు
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:43 PM
Don’t Neglect Your Studies గిరిజన విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర గిరిజనసంక్షేమశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎంఎం నాయక్ అన్నారు. సీతంపేట ఏజెన్సీలో శుక్రవారం ఆయన పర్యటించారు. తొలుత హడ్డుబంగి గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు.
ఉన్నత లక్ష్యాల కోసం పట్టుదలతో చదవాలి
సీతంపేట, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర గిరిజనసంక్షేమశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎంఎం నాయక్ అన్నారు. సీతంపేట ఏజెన్సీలో శుక్రవారం ఆయన పర్యటించారు. తొలుత హడ్డుబంగి గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలు, విద్య, వసతిసౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం గిరిజన విద్యార్థినులతో ముచ్చటించారు. విద్యాప్రగతి, మెనూ అమలు, సౌకర్యాలు, నిర్దేశిత లక్ష్యాలను వారిని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్క రించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో పవార్స్వప్నిల్ జగన్నాథ్ను ఆదేశించారు. ఉన్నత లక్ష్యాల కోసం పట్టుదలతో చదవాలని ఆయన సూచించారు. భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ముందుకుసాగాలని హితవు పలికారు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా వాటిని అధిగమించి రాణించాలన్నారు. ఉపాధ్యాయ సిబ్బంది కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఆదేశించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పాఠశాలలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ఆడలి వ్యూపాయింట్ను సందర్శించారు. పర్యాటకుల కోసం నిర్మించిన కాటేజీలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.