తాగునీటి సరఫరా నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:00 AM
పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాకు సంబంధించిన వ్యవస్ధల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి అన్నారు.
బొబ్బిలి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాకు సంబంధించిన వ్యవస్ధల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఇంజనీర్లు, సచివాలయ ఎమనిటీస్ సెక్రటరీలు, పైప్లైన్ ఫిట్టర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. భోజరాజపురం ప్రధాన నీటిసరఫరా కేంద్రం వద్ద అన్ని మోటార్లు, బోర్వెల్స్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అన్నీ వినియోగంలో ఉండేలా చూడాలన్నారు. ఇన్ఫిల్ర్టేషన్ బావులకు నీరు ప్రవహించే మార్గాన్ని ఏర్పాటు చేయాలని, వార్డులలో తాగునీరు సరఫరా అయ్యేటప్పుడు తాగునీటి నాణ్యతను, సరఫరా తీరును పర్యవేక్షించాలని సంబంధిత ఉద్యోగులను ఆదేశించారు. డ్రైనేజీల్లో పైపులైన్లు ఉంటే వెంటనే వాటిని మార్చాలన్నారు. టెండరు స్థాయిలో ఉన్న పనులన్నింటికీ వెంటనే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.. వీధిదీపాలను పరిశీలించి మరమ్మతులు ఉంటే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.