అనుమానాస్పదంగా డాక్యార్డ్ ఉద్యోగి మృతి
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:24 AM
విశాఖ డాక్యార్డ్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
ఎస్.కోట రూరల్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): విశాఖ డాక్యార్డ్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలం వేములాపల్లి గ్రామానికి చెందిన లగుడు సుధాకర్(36) విశాఖ డాక్యా ర్డ్లో గత ఐదేళ్లగా పనిచేస్తున్నారు. తన భార్య లావణ్య, ఇద్దరు పిల్లలతో విశాఖపట్నం బాలాజీ జంక్షన్లో నివాసం ఉంటున్నారు. ఈనెల 22న స్వగ్రామం వేములాపల్లిలో పెళ్లి ఉందని కుటుంబంతో వచ్చారు. తిరిగి ఈనెల 24న తన భార్య, పిల్లలను విశాఖ పంపించారు. తాను మాత్రం తర్వాత వస్తానని చెప్పి వేములాపల్లిలోనే ఉన్నారు. రాత్రి భోజనంచేసి పడుకున్నారు. ఉదయం అతని తల్లిదండ్రులు పొలానికి వెళ్లే సమయంలో కుమారుడు పడుకుని ఉండడంతో లేపకుండా వెళ్లిపోయారు. అయితే సుధాకర్ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో గ్రామ సమీపంలోని జంగం గరువు వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే కుటుంబీకులు వచ్చి, చెట్టు నుంచి దింపి చూసేసరికి సుధాకర్ మృతిచెంది ఉన్నారు. వెంటనే వారు ఎస్.కోట పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయంపై సీఐ నారాయణమూర్తి వివరణ కోరగా సమాచారం వచ్చిందని, మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు ఇచ్చారని, ఇంకా విచారణ జరపాల్సి ఉందని తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని చెప్పారు.