danger with led lights కంటిపై పడితే అంతే
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:23 AM
danger with led lights జిల్లాలో వాహనాలకు ఎల్ఈడీ లైట్ల వినియోగం ఎక్కువైంది. ఈ లైట్లు అధిక కాంతి ఇస్తుండడంతో వాహనాలకు ఇష్టారాజ్యంగా అమర్చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, లారీలు, బస్సులు, ఆటోలు ఇలా ప్రతి వాహనానికీ ఎల్ఈడీ లైట్లు దర్శనమిస్తున్నాయి.
కంటిపై పడితే అంతే
ప్రాణాలు తీస్తున్న ఎల్ఈడీ లైట్లు
వాహనాలకు ఇష్టారాజ్యంగా అమరిక
ఎదుటి వాహనచోదకుల కళ్లపై ప్రభావం
ఎక్కడికక్కడే ప్రమాదాలు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
- కొద్దిరోజుల కిందట గుర్ల సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయనగరం నుంచి ద్విచక్ర వాహనంపై సాయంత్ర సమయంలో ఇద్దరు వ్యక్తులు రాజాం వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనానికి చెందిన ఎల్ఈడీ లైట్ల వెలుతురు వీరి కళ్లపై పడింది. దీంతో ఏమీ కనిపించకపోవడంతో డివైడర్ను ఢీకొట్టి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యారు.
- గత నెలలో విజయనగరానికి చెందిన ఓ యువకుడు రాత్రివేళ గజపతినగరం నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా కలెక్టరేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహన ఎల్ఈడీ లైట్ల ఫోకస్ ఈయన కళ్లపై పడింది. దీంతో బైక్ అదుపు తప్పి జారి పోయింది. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాహనాలకు ఎల్ఈడీ లైట్ల వినియోగం ఎక్కువైంది. ఈ లైట్లు అధిక కాంతి ఇస్తుండడంతో వాహనాలకు ఇష్టారాజ్యంగా అమర్చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, లారీలు, బస్సులు, ఆటోలు ఇలా ప్రతి వాహనానికీ ఎల్ఈడీ లైట్లు దర్శనమిస్తున్నాయి. వీటి కాంతి ఎదురుగా వచ్చే వాహనచోదకుల కళ్లపై పడుతుండడంతో వారికి ఏమి కనిపించక గందరగోళానికి గురై ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. వాస్తవానికి కారుకు 75 వాట్స్, లారీకి 100 వాట్స్, ద్విచక్ర వాహనాలకు 10వాట్స్ లైట్లను వినియోగించాలనే నిబంధన ఉంది. దీనిని వాహనదారులు పట్టించుకోవడం లేదు. కొందరు ద్విచక్ర వాహనదారులు తమ వాహనానికి ఆరు నుంచి 8 ఎల్ఈడీ లైట్లను బిగిస్తున్నారు. గరిష్ఠంగా 70 వాట్ల మించిన ఫోకస్ లైట్లు వాడకూడదని నిబంధన ఉన్నా హైబీమ్ లైట్లను వాడుతున్నారు. హైబీమ్ ఎల్ఈడీ లైట్లు వాడితే ఆర్టీఏ చట్టం ప్రకారం రూ.500 నుంచి రూ.1500 వరకు జరిమానా విధించాలని సుప్రీంకోర్టు సూచించినా అధికారులు, పోలీసులకు పట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వాహనాలను బట్టి లైట్లు ఉండాలని, అడాప్టివ్ హెడ్లైట్లను వాహనం తయారు చేస్తున్న సమయంలోనే తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది కానీ ఆచరణ లేదు.
కంపెనీ ఇచ్చిన లైట్లనే వాడాలి
వాహనాలకు సంబంధించి హెడ్లైట్ల విషయంలో దృష్టి సారించాం. వాహనం తయారు చేసే సమయంలో ఉన్న లైట్లనే వాడాలి. అధిక ఫోకస్ వచ్చేలా హైబీమ్, ఎల్ఈడీ లైట్లు వాడితే జరిమానా తప్పదు. ప్రతి వాహనం హెడ్లైట్కు పైభాగంలో నలుపు రంగు సగం వేసుకోవాలి. వాహనాలు తనిఖీ చేసేటప్పుడు హెడ్లైట్లు పరిశీలించాలని సిబ్బందికి సూచించాం.
- ప్రకాష్, ఆర్టీవో, విజయనగరం
------------