రాజీయే రాజమార్గం
ABN , Publish Date - Jul 11 , 2026 | 11:51 PM
కేసుల పరిష్కారానికి రాజీయే రాజమార్గమని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.మాధురి తెలిపారు.
- రెండో అదనపు జిల్లా న్యాయాధికారి మాధురి
- లోక్అదాలత్లో 1,174 కేసుల పరిష్కారం
బెలగాం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కేసుల పరిష్కారానికి రాజీయే రాజమార్గమని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.మాధురి తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన రెండో జాతీయ లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయ వివాదాలను త్వరితగతిన, పరస్పర రాజీద్వారా పరిష్కరించుకోవడానికి లోక్అదాలత్లు ఉత్తమ వేదికలని పేర్కొన్నారు. కోర్టుల చుట్టూ తిరగుతూ సమయం, ధనం వృథా చేసుకోవడం కంటే రాజీమార్గాన్ని ఎంచుకోవడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. జిల్లాలో నిర్వహించిన లోక్అదాలత్లో మొత్తం 1,174 కేసులను విజయవంతంగా పరిష్కరించినట్టు తెలిపారు. వీటిలో 14 సివిల్, 1,160 క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. లోక్అదాలత్ నిర్వహణ కోసం మూడు బెంచ్లను ఏర్పాటు చేశారు. బెంచ్-1లో టి.జోగారావు, కె.నవీన్, బెంచ్-2లో సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణమూర్తి, న్యాయవాదులు కె.బాపూజీ, జి.శరత్చైతన్య, బెంచ్-3లో అదనపు సివిల్ న్యాయధికారి జె.సౌజన్య, జోసఫిన్తో పాటు న్యాయవాదులు జి.రాజ్కుమార్, అల్పి రాజు సభ్యులుగా పాల్గొన్నారు.