ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బస్సు
ABN , Publish Date - May 23 , 2026 | 11:53 PM
విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.
దత్తిరాజేరు, మే 23(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలంలోని కోరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన దనాన మోహనరావు(26) కొన్నేళ్లుగా ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్తుండగా.. విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మోహనరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లిదండ్రులు చినరామునాయుడు, లక్ష్మీలు తన స్వగ్రామంలో వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కొడుకుని కాయకష్టంతో చదివించి ఇంతటివాడిని చేశామని, ఇంతలో ఈ ఘోరం జరిగిందని కన్నీటి పర్యాంతమ య్యారు. వీరిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో కోరపు కృష్ణాపురం లో విషాదఛాయలు అలముకున్నాయి.