అన్నయ్యా.. కుటుంబం జాగ్రత్త
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:24 AM
‘అన్నయ్యా.. నేను ఇక బతకను.. మీరంతా జాగ్రత్త.. అమ్మ, మన కుటుంబం అంతా జాగ్రత్త..’ ఇవి కొనఊపిరితో ఉన్న ఓ తమ్ముడు తన అన్నతో చెప్పిన మాటలు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ తమ్ముడి చివరి మాటలు
విజయనగరం, నెల్లిమర్ల, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ‘అన్నయ్యా.. నేను ఇక బతకను.. మీరంతా జాగ్రత్త.. అమ్మ, మన కుటుంబం అంతా జాగ్రత్త..’ ఇవి కొనఊపిరితో ఉన్న ఓ తమ్ముడు తన అన్నతో చెప్పిన మాటలు. రోడ్డు ప్రమాదానికి గురై.. రక్తపు మడుగులో ఉన్న తన తమ్ముడిని ఆసుపత్రిలో చేర్పించగా, శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. విషణ్ణవదనంతో చెప్పిన మాటలు ఆ అన్న గుండెలు పగిలేలా చేశాయి. వివరాల్లోకి వెళితే.. నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామానికి చెందిన పతివాడ గోవింద్(40) నెల్లిమర్ల నుంచి విజయనగరం వెళ్లే రోడ్డులో పెట్రోల్ బంక్ చెంతనే వాటర్ సర్వీసింగ్ సెంటర్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధురాలైన తల్లితో పాటు అన్న రమణ, భార్యా పిల్లలతో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం తన వాటర్ సర్వీసిం గ్ సెంటర్ వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. వెనుక నుంచి నిర్లక్ష్యంగా, అజాగ్ర త్తగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు.. గోవింద్ను వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో రహదారిపై తుళ్లిపడిన గోవింద్.. చివరిమాటలు చెప్పి, అపస్మారక స్థితిలో కి వెళ్లిపోయారు. మృత్యువుతో పోరాడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఈయన ప్రస్తుతం తుమ్మలపేట పీఏసీఎస్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మృతుడి అన్న రమణ ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు, కూటమి నాయకులు సువ్వాడ రవిశేఖర్, కడగల ఆనంద్కుమార్, చనమల్లు వెంకటరమణ, బూర్లె శ్రీధర్, లెంక అప్పలనాయుడు, గేదెల రాజారావు, అంబల్ల అప్పలనాయుడు, రవ్వా నాని, అప్పికొండ రవికుమార్లు నివాళులు అర్పించారు.