Bravo, Santosh! శభాష్ సంతోష్
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:26 AM
Bravo, Santosh! పాలకొండ నగర పంచాయతీ పరిధి వడమ కాలనీకి చెందిన బొద్దాన కల్యాణ్ ప్రసాద్ (అప్పన్న), పార్వతిల చిన్న కుమారుడైన బొద్దాన సంతోష్ ఏఐ విభాగంలో ప్రతిభ కనబర్చారు. రూ.కోటికి పైగా ప్యాకేజీతో గూగుల్ ఏఐ/ఎంఎల్ విభాగంలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాన్ని సంపాదించారు. దీంతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రూ.కోటికి పైగా వేతనం
పాలకొండ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): పాలకొండ నగర పంచాయతీ పరిధి వడమ కాలనీకి చెందిన బొద్దాన కల్యాణ్ ప్రసాద్ (అప్పన్న), పార్వతిల చిన్న కుమారుడైన బొద్దాన సంతోష్ ఏఐ విభాగంలో ప్రతిభ కనబర్చారు. రూ.కోటికి పైగా ప్యాకేజీతో గూగుల్ ఏఐ/ఎంఎల్ విభాగంలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాన్ని సంపాదించారు. దీంతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాలకొండలోని టెన్త్, ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్న సంతోష్ ఆ తర్వాత రాజాంలో ఓ ప్రైవేట్ కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎంపికై ఉద్యోగం చేస్తూనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీలో 20 పైగా సర్టిఫికేషన్ చేశారు. ఆ తర్వాత ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్గా ముంబైలో కొద్దిరోజులు పనిచేశారు. రానున్న రోజుల్లో ఏఐతో వచ్చే మార్పులను ముందుగానే గమనించిన ఆయన ప్రభుత్వం ఉద్యోగం నుంచి బయటకు వచ్చి బోసెచ్ కంపెనీ రీసెర్చ్ విభాగంలో చేరారు. పలు రీసెర్చ్ పేపర్ల పేటెంట్స్ను సంతోష్ ప్రచురించారు. జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో తన ప్రాజెక్టును ప్రజెంట్ చేసి బెస్ట్ ప్రాజెక్టు అవార్డును సైతం అందుకున్నారు. ఆ తర్వాత ప్రఖ్యాత ఐఐఎస్ బెంగళూరు కాలేజ్లో డేటా సైంటిస్ట్ కోర్సులో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం గూగుల్లో కష్టతరమైన డేటా స్ట్రక్చర్లో జరిగిన పది రౌండ్ల ఇంటర్వ్యూల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాన్ని సంపాదించారు. అదే సమయంలో మైక్రోస్టాఫ్ట్లో కూడా ఏఐ విభాగంలో ఉద్యోగం వచ్చినా.. దానిని వదులుకుని.. రెండు రోజుల కిందట ఆయన రూ.కోటికిపైగా ప్యాకేజీతో గూగుల్లో చేరారు. ప్రణాళికతో కూడిన శ్రమతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని సంతోష్ తెలిపారు.