విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:12 AM
విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
గజపతినగరం, జూలై 14(ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొండపల్లి మండలం కనిమెరక గ్రామానికి చెందిన లోచర్ల గణేష్(17) గత రెండు నెలల కిందట వరుసకు అక్క అయిన అశ్విని ఇంటికి గజపతినగరం వచ్చాడు. మంగళవారం తన అక్క భర్తకు చెందిన వాటర్ సర్వీసింగ్ సెంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ పంపుసెట్టును పట్టుకోగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్ర గాయలపాలైన గణేష్ను స్థానిక ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. అయితే అప్పటికే గణేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లిదండ్రులు లోచర్ల రాము, ఆదిలక్ష్మిలు విశాఖపట్నంలోగల అపార్టుమెంట్లో వాచ్మెన్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చేతికి అందొస్తాడనుకున్న కొడుకు ఇలా మృతిచెందడంతో తండ్రి రాము కన్నీరు మున్నీరయ్యాడు. తండ్రి రాముకు గణేష్తో పాటు కుమార్తె లక్ష్మి ఉంది. లక్ష్మికి వివాహమైంది. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కె.కిరణ్కుమార్నాయుడు తెలిపారు.