Share News

కాంగ్రెస్‌ కార్యాలయంపై బీజెపీ శ్రేణుల దాడి

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:03 AM

ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ ప్రాంగణంలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేయడంపై నిరసనగా నగరంలోని తోటపాలెం వద్దనున్న కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై శనివారం బీజేపీ నాయకులు దాడి చేశారు

 కాంగ్రెస్‌ కార్యాలయంపై బీజెపీ శ్రేణుల దాడి
డీసీసీ కార్యాలయ ఆవరణలో నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

- పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు ధ్వంసం

- 20 మందిపై కేసు నమోదు

విజయనగరం క్రైం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ ప్రాంగణంలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేయడంపై నిరసనగా నగరంలోని తోటపాలెం వద్దనున్న కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై శనివారం బీజేపీ నాయకులు దాడి చేశారు. కార్యాలయఆవరణలోని కాంగ్రెస్‌ జెండాలు, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ మాట్లాడుతూ.. ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లోకి కాంగ్రెస్‌ యూత్‌ నాయకులు ఉగ్రవాదుల్లా ప్రవేశించి నిరసన తెలియజేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించిన యూత్‌ కాంగ్రెస్‌ గూండాలను అరెస్టు చేయాలని, దేశ ప్రజలకు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ కార్యాలయంపై దాడిని ఆ పార్టీ నగర అధ్యక్షుడు సుంకరి సతీష్‌కుమార్‌ ఖండించారు. విజయనగరంలో ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదని, ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఈ సంఘటనపై వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని చెప్పారు. సతీష్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 20 మంది బీజేపీ నాయకులపై కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్‌ సీఐ ఆర్‌వీఆర్‌కె చౌదరి తెలిపారు. ఈ కేసును ఎస్‌ఐ రవికుమార్‌ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Feb 22 , 2026 | 12:03 AM