Tribal Communities గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:10 AM
Better Healthcare Should Be Provided to Tribal Communities ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డి ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మంగళవారం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
గుమ్మలక్ష్మీపురం, మార్చి10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డి ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మంగళవారం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. హాజరు పట్టికను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇన్పేషెంట్ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. ఫార్మసీలో మందుల నిల్వలు పరిశీలింఆచారు.
లక్కగూడలో పనుల పరిశీలన
లక్కగూడలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పెర్కోలేషన్ ట్యాంక్ పనులను జేసీ పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే ఈ పనులు పూర్తి చేస్తే.. ద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. తద్వారా స్థానిక రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు.
ఏజెన్సీలో జేసీ ఆకస్మిక తనిఖీలు
జియ్యమ్మవలస, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో పలు చోట్ల మంగళవారం జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ముందుగా ఆర్ఆర్బీ పురం పీహెచ్సీని సందర్శించారు. ‘ముస్తాబు’కు సిద్ధం చేస్తున్న పనులను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.ఆర్అండ్బీ రోడ్డు నుంచి పీహెచ్సీ వరకు సిమెంటు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గిరిజనాభ్యుదయ సంఘం నాయకులు ఆయన్ని కోరారు. అనంతరం జేసీ పీటీ మండ ఆశ్రమ పాఠశాల, టీకే జమ్ము గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డిప్యూటీ వార్డెన్ ఎం.లక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థినులతో కలిసి భోజనం చేసి.. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎంఅండ్హెచ్వో భాస్కరరావు, తదితరులు ఉన్నారు.