Be accountable to the people ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:39 AM
Be accountable to the people ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉన్నప్పుడే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలి
డీఆర్సికి నివేదికలతో రాకపోతే ఎలా?
ఇకపై సహించేది లేదు
జిల్లా అధికారులపై మండిపడిన ఇన్చార్జి మంత్రి అనిత
అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం: మంత్రి కొండపల్లి
విజయనగరం ఆంధ్రజ్యోతి/కలెక్టరేట్, మార్చి 30(ఆంధ్రజ్యోతి):
ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉన్నప్పుడే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో గ్రామీణ మంచి నీటి విభాగం, ఇరిగేషన్, ఉద్యాన సాగు, ఆగ్ని ప్రమాదాల నివారణ తదితర అంశాలపై సమీక్షించారు. తొలుత నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ జలజీవన మిషన్ ద్వారా ఏ పనులు చేపడుతున్నారో? తెలియకుండా తన నియోజకవర్గంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నివేదికలు పంపించారని ప్రస్తావించారు. ఎస్.కోట నియోజకవర్గంలో కూడా అదే పరిస్ధితి నెలకొందని ఎస్.కోట శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి వివరించారు. దీనిపై ఆర్డబ్య్లూఎస్ ఎస్ఈ కవిత మాట్లాడుతూ రెండు రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు రావడంతో ప్రజాప్రతినిధులకు చెప్పలేకపోయామని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి అనిత ఇక నుంచి అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బొబ్బిలి ఎంఎల్ఏ బేబినాయన మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో గతంలో ఉన్న ఓ రోడ్డును అభివృద్ధి చేయాలంటే ఫారెస్టు క్లియరెన్స్ ఇవ్వడం లేదని, దీంతో రోడ్డు పనులు జరగడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎస్.కోట మండలం మారిక గ్రామానికి కూడా ఇదే పరిస్థితి ఉందని ఎస్.కోట ఎమ్మెల్యే వివరించారు. మారిక గ్రామంలో పాఠశాల లేదని ఎంఎల్సి గాదె శ్రీనివాసులు నాయుడు తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టరు రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే పంచాయతీరాజ్ ఎస్ఈ ద్వారా అటవీ శాఖ అధికారులతో సమావేఽశం ఏర్పాటు చేయాలని సూచించారు.
పూసపాటిరేగ మండలంలోని ఆరు గ్రామాల్లో కొంతమంది స్థానికంగా ఉన్న కంపెనీ కాలుష్యం వల్ల అలసర్లు బారిన పడ్డారని ఎంఎల్సి సురేష్ బాబు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయా గ్రామాల్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి జిల్లా వైద్యాఽధికారికి సూచించారు. జిల్లా కేంద్రంలో ఆర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజయనగరం శాసన సభ్యురాలు అదితీగజపతిరాజు కోరారు. మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ భోగాపురం మండలంలోని చెరుకుపల్లిలో 2019 టీడీపీ ప్రభుత్వ హయంలో 72 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని, ఆ స్థలాలు అప్పగించలేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా స్థలాలు ఇవ్వలేదని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ ఇక నుంచి అధికారులు అంతా జిల్లాలో జరిగే డీఆర్సికి నివేధికలతో రావాలని సూచించారు. ఇది చివరి అవకాశమని ఇక ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు.
అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం: మంత్రి కొండపల్లి
అర్హత ఉన్న అందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇందుకోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి సూమారు 50 ఎకరాలు గుర్తించాలని అధికారులకు సూచించారు. దీనికి నిధులు కూడా మంజూరై సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.