'Anywhere registration' is not being done! ఎనీవేర్ రిజిస్ట్రేషన్ చేయట్లే!
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:05 AM
'Anywhere reg istration' is not being done! స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి రాష్ట్రంలో ఏ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం నుంచైనా రిజిస్ర్టేషన్లు చేసుకునే ఎనీ వేర్ రిజిస్ర్టేషన్ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.
ఎనీవేర్ రిజిస్ట్రేషన్
చేయట్లే!
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో అన్నీ సాధారణ రిజిస్ర్టేషన్లే
ఎనీవేర్కు అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తున్న సబ్ రిజిస్ర్టార్లు
చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు
మామూళ్ల కోసమే చేయడం లేదంటున్న భూముల క్రయవిక్రయదారులు
స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి రాష్ట్రంలో ఏ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం నుంచైనా రిజిస్ర్టేషన్లు చేసుకునే ఎనీ వేర్ రిజిస్ర్టేషన్ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. అయితే స్థానిక అధికారుల నిర్లక్ష్యమో.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమో కాని దాదాపుగా ఎక్కడా అమలు కావడం లేదు. అన్నీ సాధారణ రిజిస్ట్రేషన్లే జరుగుతున్నాయి. ఎనీవేర్కు అనుమతి ఇవ్వడానికి సబ్ రిజిస్ర్టార్లు నిరాకరిస్తున్నారు. మామూళ్ల కోసమే చేయడం లేదని భూముల క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు.
కొత్తవలస, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కొత్తవలస, ఎస్.కోట, విజయనగరం(ఆర్వో), విజయనగరం వెస్ట్, భోగాపురం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, రాజాం, తెర్లాంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఎనీవేర్ రిజిస్ర్టేషన్ విధానం అమలులోకి తీసుకొచ్చాక అన్నిచోట్లా కొద్ది నెలలు కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. తర్వాత మందగించాయి. ఇప్పుడు వందలో ఒక రిజిస్ర్టేషన్ మాత్రమే జరుగుతోంది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకటే పద్ధతి ఉండేది. ఎక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేసుకుంటే అక్కడి సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలోనే రిజిస్ర్టేషన్లు చేసుకునే వారు. అన్ని కార్యాలయాలు ఆన్లైన్తో అనుసంధానం చేసి ఉండడంతో ఎక్కడి నుంచైనా, ఎక్కడి ఆస్తినైనా సబ్ రిజిస్ర్టార్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం ఎనీవేర్ పద్ధతిని అమలులోకి తీసుకొచ్చింది.
ఒక సబ్ రిజిస్ర్టార్ కార్యాలయ పరిధిలోని ఆస్తిని మరో సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజస్ర్టేషన్ చేసుకుంటే ఆ దస్తావేజును సంబంధిత ఆస్తి ఉన్న రిజిస్ర్టేషన్ కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా పంపించేవారు. ఆన్లైన్లో వచ్చిన దస్తా వేజును సబ్ రిజిస్ర్టార్ పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే 24 గంటలలోనే అనుమతి ఇచ్చేవారు. ఆ తరువాత ఈ గడువును 48 గంటలకు పెంచింది. అనుమతి వచ్చే వరకు రిజిస్ర్టేషన్కు పెండింగ్ నెంబర్ను కేటాయించి అనుమతి ఇచ్చిన తరువాత రెగ్యులర్ నెంబర్ ఇచ్చి దస్తావేజును స్కాన్ చేసి పార్టీలకు అందజేసేవారు. ఈపద్ధతి పార్టీలకు సౌకర్యంగా ఉండడంతో మంచి ఫలితాలే వచ్చాయి. అయితే గత కొద్ది నెలలుగా సబ్ రిజిస్ర్టార్లు అప్రూవల్ను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ఎనీ వేర్ రిజిస్ర్టేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
- ఎనీ వేర్ రిజిస్ర్టేషన్లకు అప్రూవల్ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో సబ్ రిజిస్ర్టార్లను హెచ్చరించడంతో జోరుగా జరిగేవి. కొద్ది నెలలుగా ఆ పరిస్థితి లేదు. ఉన్నతాధికారులు కూడా పట్టించకోకపోవడంతో ప్రస్తుతం ఎక్కడా ఎనీ వేర్ రిజిస్ర్టేషన్లు జరగడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను అధిగమించ లేకపోతున్నామని, అందుకే ఎనీవేర్ దరఖాస్తులకు అప్రూవల్ ఇవ్వడం లేదంటున్నారు. ఉన్నతాధికారులు లక్ష్యాలను విధించకపోతే ఎక్కడ నుంచి రిజిస్ర్టేషన్లు చేసుకున్నా తమకు అభ్యంతరాలు లేవనే వాదన వినిపిస్తున్నారు.
- ఫీజు టూ ఫీజుకు గండి పడుతుందనే ఎనీవేర్ రిజస్ర్టేషన్లు చేయడం లేదని భూముల క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ఫీజుటూ ఫీజు అనే పద్ధతి అనధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతోంది. అంటే ఆస్తి విలువపై ఎంత రిజిస్ర్టేషన్ ఫీజు కడితే కార్యాలయంలో అంతే మొత్తాన్ని సబ్ రిజిస్ర్టార్లకు ముట్ట చెప్పాల్సి ఉంటుంది. ఎనీ వేర్ రిజిస్ర్టేషన్లు చేస్తే ఈ ఫీజుకు గండి పడుతుందనే వారంతా వెనుకంజ వేస్తున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆస్తి విలువపై రిజిస్ర్టేషన్ ఫీజు 1 శాతం వసూలు చేస్తుండగా ఫీజు టూఫీజు కింద అరశాతం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వసూళ్లు దస్తా వేజు లేఖర్ల ద్వారా చేయడం వల్ల దస్తా వేజు లేఖర్లకు అవినీతి మరక అంటుతోంది. కారణం ఏదైనా ఎనీ వేర్ రిజిస్ర్టేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గింది.
- రాష్ట్రంలో ఏ సబ్ రిజస్ర్టార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ జరిగినా ఆదాయం మాత్రం ప్రభుత్వ ఖజానాకే చేరుతున్నప్పుడు ఎందుకీ నిబంధనలని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎనీ వేర్ సజావుగా జరగాలంటే సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు విధించే లక్ష్యాలను రద్దు చేయాలని, అప్పటికీ చేయకపోతే అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.