అమాత్యా.. ఇవిగో సమస్యలు
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:29 PM
బొబ్బిలి మున్సిపాలిటీలో అనేక సమస్య లు రాజ్యమేలుతున్నాయి. పట్టణంలోని రోడ్లు విస్తరణకు నోచుకోవడం లేదు. క్రీడా మైదానం,
- రోడ్ల విస్తరణ లేక ఇబ్బందులు
- నిలిచిన ఇండోర్ స్టేడియం పనులు
- తాగునీటి పథకానికి కలగని మోక్షం
- నేడు బొబ్బిలిలో మంత్రి నారాయణ పర్యటన
బొబ్బిలి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపాలిటీలో అనేక సమస్య లు రాజ్యమేలుతున్నాయి. పట్టణంలోని రోడ్లు విస్తరణకు నోచుకోవడం లేదు. క్రీడా మైదానం, తాగునీటి పథకం పను లు నిలిచిపోయాయి. సుందరీకరణలో భాగంగా పట్టణంలోని ముఖ్య కూడళ్లను ఇటీవల విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దా రు. అయితే, ప్రజాసమస్యలు ఇంకా అనేకం పట్టిపీడిస్తున్నాయి. ఆదివారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ బొబ్బిలిలో పర్యటించను న్నారు. దీంతో పట్టణ ప్రజలు ఆయనపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. సమ స్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నారు.
ఇవీ సమస్యలు..
పట్టణంలో దశాబ్దాలుగా రహదారులు విస్తరణకు నోచుకోవడం లేదు. దీంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పట్టణ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇండోర్ స్టేడియం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ పనులు పూర్తి చేయాలని క్రీడాకా రులు, క్రీడాభిమానులు కోరుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఈ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. ఇళ్లు రద్దయిన వారికి డిపాజిట్లను వాపసు చేయకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
సువర్ణముఖి నది వద్ద గతంలో రూ.95 కోట్లతో తాగునీటి పథకం పనులు ప్రారంభించారు. ఈ పనులు జరగకపోవడంతో పట్టణ ప్రజలను తాగునీటి సమస్య వేధిస్తోంది.
స్థానిక సీహెచ్సీని వందపడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్న హామీ అమలుకు నోచుకోవడం లేదు.
ఇందిరమ్మకాలనీ, రత్నాల నగర్ తదితర ఆవాస ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు.
చారిత్రాత్మక పట్టణమైన బొబ్బిలిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్న హామీ నెరవేరడం లేదు.
ప్రభుత్వ ఐటీఐ, ఉద్యానక్షేత్రం, గ్రోత్సెంటరు వంటి వాటికి ఎటువంటి ప్రగతి లేదు.
ప్రభుత్వ అతిథిగృహం, ప్రభుత్వ వసతిగృహాలు శిథిలమైపోయి వృథాగా పడి ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన చొరవచూపుతారని స్ధానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.