Akshaya Tritiya అక్షయ తృతీయకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:44 AM
All Set for Akshaya Tritiya Celebrations వైశాఖ శుద్ధ తృతీయ సందర్భంగా ఈ నెల 20న అక్షయ తృతీయ జరుపుకునేందుకు జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు. ఇష్ట దైవాలను కొలి చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజున సెంటిమెంట్గా ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేయాలనుకునే వారు.. బంగారం ధరను చూసి.. పుత్తడి కొనుగోలుపై తర్జన భర్జన పడుతున్నారు.
కొనుగోలుపై ప్రజల మీమాంస
సాలూరు రూరల్, ఏప్రిల్19(ఆంధ్రజ్యోతి): వైశాఖ శుద్ధ తృతీయ సందర్భంగా ఈ నెల 20న అక్షయ తృతీయ జరుపుకునేందుకు జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు. ఇష్ట దైవాలను కొలి చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజున సెంటిమెంట్గా ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేయాలనుకునే వారు.. బంగారం ధరను చూసి.. పుత్తడి కొనుగోలుపై తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,58,000గా ఉంది. గతేడాది అక్షయ తృతీయకు రూ. 98,280 ( ఏడాదిలో పెరిగిన ధర పది గ్రాములకు రూ. 59,720) ఉండేది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,45,000గా ఉంది. గతేడాది ఇదే సమయానికి రూ. 89,500 ( ఏడాదిలో పెరిగిన ధర పది గ్రాములకు రూ. 55,500 )గా ఉండేది. మొత్తంగా పది గ్రాముల ధర రూ. లక్షన్నర దాటడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. గతేడాది అక్షయ తృతీయ నాడు జిల్లాలో రూ. 3కోట్లకు పైబడి పుత్తడి వ్యాపారం జరిగింది. ఈ ఏడాది బంగారం ధర అధికంగా ఉన్న నేపథ్యంలో అమ్మకాలు ఎలా ఉంటాయన్నది వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఏదేమైనా అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడితే బంగారం ధర తగ్గే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ సందర్భంగా ఈ ఏడాది పరిమితంగానే వ్యాపారం జరిగే అవకాశం ఉందని పుత్తడి వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గతేడాది కంటే ఈ సారి 45 శాతం వరకు బంగారం అమ్మకాలు తగ్గే అవకాశముందని సాలూరు బంగారం వర్తకులు సంఘం ప్రతినిధి సుతాపల్లి వీరవెంకటరావు తెలిపారు. ‘అక్షయ తృతీయ సందర్భంగా బంగారమే కొనుగోలు చేయాలని లేదు. గళ్ల ఉప్పు, బెల్లం కొనుగోలు చేసినా మంచిదే. ఈ ఏడాది అక్షయ తృతీయ పూజను ఉదయం ఏడున్నర గంటల్లోగా చేస్తే మంచిది.’ అని రుత్వికుడు ఆర్.పార్థసారథి తెలిపారు.