రీసర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:16 PM
జిల్లాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక భూ రీసర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి హెచ్చరించారు.
- జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డి
పార్వతీపురం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక భూ రీసర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో రీసర్వే పురోగతి, మ్యుటేషన్ల పెండింగ్ అంశాలపై సమీక్షించారు. వెరిఫికేషన్ ప్రక్రియలో ఎటువంటి తప్పులు జరగడానికి వీలు లేదని, ఒకవేళ ఏమైనా పొరపాట్లు జరిగితే దానికి సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి సందేహం ఉన్నా తహసీల్దార్ లేదా పైఅధికారులను సం ప్రదించవచ్చునని జేసీ స్పష్టం చేశారు. మూడో విడత రీసర్వే పూర్తి చేసి తుది ఆర్వోఆర్ వచ్చిన తర్వాత నాలుగో విడత రీసర్వే పనులు చేపట్టాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి వచ్చే శనివారం నాటికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, జిల్లా సర్వే, భూ రికార్డుల అధికారి ఎం.శ్రీనివాసరావు, డీఐవోఎస్ఎంఎస్, ఆర్ఎస్డీటీలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.