హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:19 AM
జామి మండలం విజినిగిరి గ్రామానికి చెందిన వెంపడాపు సూరిబాబు (33)కు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా, సెషన్స్ న్యాయాధికారి ఎం.బబిత తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్ ఓ ప్రకటనలో తెలిపారు.
విజయనగరం క్రైం,ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): జామి మండలం విజినిగిరి గ్రామానికి చెందిన వెంపడాపు సూరిబాబు (33)కు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా, సెషన్స్ న్యాయాధికారి ఎం.బబిత తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే... విజినిగిరికి చెందిన వెంపడాపు సూరిబాబు సెల్ఫోన్ దొంగతనం చేసి తన స్నేహితుడైన గనివాడ అచ్చుంనాయుడు (మృతుడు)కి ఇచ్చి విక్రయించాలని చెప్పాడు. దీంతో సెల్ఫోన్ విక్రయించగా వచ్చిన మొత్తాన్ని సూరిబాబుకు అచ్చుంనాయుడు అందజేశాడు. ఈ క్రమంలో జామి పోలీసులకు సెల్ఫోన్ చోరీపై ఫిర్యాదు అందింది. దీంతో నిందితులిద్దరినీ పోలీసులు స్టేషన్కు పిలిచారు. వెంపడాపు సూరిబాబు సెల్ఫోన్ దొంగతనానికి పాల్పడినట్లు అచ్చుంనాయుడు తెలిపాడు. అప్పటి నుంచి సూరిబాబు తన స్నేహితుడైన గనివాడ అచ్చుంనాయుడుపై కక్ష పెట్టుకున్నాడు. ఆమేరకు 2024 నవంబరు 7న అచ్చుంనాయుడును సూరిబాబు హత్య చేశాడు. దీనిపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు జామి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈమేరకు నిందితుడిని అప్పటి ఎస్.కోట రూరల్ సీఐ కె.రవికుమార్ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈమేరకు నిందితుడికి శిక్ష విధించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన ఎస్కోట రూరల్ సీఐ ఎల్.ఆప్పలనాయుడు, జామి ఎస్ఐ వై.వీరజనార్దన్, సి.ఎం.ఎస్. ఎస్ఐ పి.ఈశ్వరరావు, కోర్టు కానిస్టేబుల్ రమేష్ బాబు, పీపీ జి.సత్యంలను ఎస్పీ అభినందించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
విజయనగరం క్రైం ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): విజయనగరం రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధి వైఎస్సార్ నగర్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుని వయస్సు 52 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. మృతదేహం సర్వజన ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పారు.