Share News

సత్వర పరిష్కారం కోసమే ప్రత్యేక గ్రీవెన్స్‌

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:23 AM

ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సత్వరం పరిష్కరించేం దుకే మండల కేంద్రాల్లో ప్రత్యేక గ్రీవెన్స్‌లు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

సత్వర పరిష్కారం కోసమే ప్రత్యేక గ్రీవెన్స్‌
నిధుల మంజూరు ఉత్తర్వులను అందజేస్తున్న కలెక్టర్‌

మక్కువ రూరల్‌, జనవరి21 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సత్వరం పరిష్కరించేం దుకే మండల కేంద్రాల్లో ప్రత్యేక గ్రీవెన్స్‌లు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయన.. జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలితో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మక్కువలో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగడంలేదని, తాగునీటి సమస్య ఉందని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దాసరి కేశవరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న ములక్కాయవలస సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డోల మధు మృతి చెందారని, పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, మధు మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి జ్యోతి కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు. దాంతో ఏఎస్పీ మనీషా రెడ్డిని విచారణ చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా 89 వినతులను కలెక్టర్‌ స్వీకరించారు. అనంతరం డోలీ మోతలు నివారణలో భాగంగా శంబర పంచాయతీ బీరమాసి గ్రామానికి రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేస్తు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యకమంలో జిల్లాలోని అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 12:23 AM