A festive occasion for the poor పేదల ఇంట పండుగ
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:24 AM
A festive occasion for the poor పేదల ఇంట పండుగ వాతావరణం నెలకొంది. తల్లికి వందనం నిధులు జమ కావడంతో వారంతా ఊరట చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తొలి రోజు బుధవారం ఎక్కువ మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి.
పేదల ఇంట పండుగ
తల్లికి వందనం జమ కావడంతో ఊరట
జిల్లాలో 1.54లక్షల మంది లబ్ధిదారులు
విడుదల వారీగా ఖాతాల్లో జమ అవుతున్న నిధులు
విజయనగరం, జూలై 22 (ఆంధ్రజ్యోతి):
పేదల ఇంట పండుగ వాతావరణం నెలకొంది. తల్లికి వందనం నిధులు జమ కావడంతో వారంతా ఊరట చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తొలి రోజు బుధవారం ఎక్కువ మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. మూడు రోజుల్లో అందరికీ అందనున్నాయి. రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం పథకం’’ రెండో ఏడాది కూడా విజయవంతంగా అమలుచేసింది. కుటుంబంలో పిల్లలు ఎంతమంది చదువుతుంటే అందరికీ వర్తించేలా పథకం మార్గదర్శకాలను గత ఏడాదే మార్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒకరికే అమ్మఒడి పేరిట జమ చేసేది. కూటమి ప్రభుత్వం అందరికీ ఇస్తోంది. ఆర్థిక భారం ఉన్నా కూడా ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న వారికీ ఈ పథకం వర్తింపచేయడం విశేషం. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని యథాతథంగా అమలు చేస్తోంది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది. ఇందులో రూ.13వేలు నేరుగా తల్లిబ్యాంక్ ఖాతాలో జమచేయగా మిగిలిన రూ.2వేలు విద్యాసంస్థ నిర్వహణకు (పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు) ఖర్చు చేస్తారు.
- జిల్లా వ్యాప్తంగా లక్షా 54,612 మందికి తల్లికి వందనం అమలవుతోంది. ఇందుకు గాను రూ.201 కోట్లను విడుదల చేస్తోంది. డీబీటీ విధానంలో తల్లుల ఖాతాల్లో జమఅయ్యేలా రూపకల్పన చేశారు. ఈ విద్యా సంవత్సరానికి జూలై మూడోవారంలో తల్లికి వందనం అందజేస్తామని చెప్పిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట నిలబెట్టుకున్నారు.
చెప్పలేని ఆనందం
ఎస్.కోట రూరల్, జూలై 22(ఆంధ్రజ్యోతి): పేదలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారంతో చెప్పలేని ఆనందం కలుగుతోందని ముషిడిపల్లికి చెందిన తల్లిదండ్రులు భారతీ, రమేష్ హర్షం వ్యక్తం చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ప్రణతి, భవ్యశ్రీ, భువనశ్రీ ఉన్నారు. ముగ్గురికి కలిపి రూ.39 వేలు అకౌంట్ పడినట్లు తల్లి భారతి తెలిపారు.
పిల్లల చదువులపై భయంలేదు
నేను రోజువారీ వ్యవసాయ కూలీని. నాకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. నా పిల్లలకు రూ.39 వేలు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక పిల్లల చదువులపై ఎలాంటి భయం లేదు. వారి భవిష్యత్తుకు డోకా లేదు. చంద్రబాబు, లోకేష్కు ధన్యవాదాలు.
- గర్భాపు స్వర్ణ, చిత్రకోట బొడ్డవలస, బొబ్బిలి మండలం