the hospital: కల సాకారమయ్యే వేళ!
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:24 AM
the hospital: సాలూరు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది.
- నేడు సాలూరులో వంద పడకల ఆసుపత్రి ప్రారంభం
- హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు
సాలూరు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): సాలూరు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది. వంద పడకల ఆసుపత్రి భవనం శుక్రవారం ప్రారంభంకానుంది. దీంతో సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రపురం మండలాల ప్రజలతోపాటు ఒడిశాలోని అనేక గ్రామాల ప్రజలకు వైద్య కష్టాలు తీరనున్నాయి. 2019 ఫిబ్రవరి 15న అప్పటి టీడీపీ ప్రభుత్వం సాలూరు వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.17 కోట్ల నిధులు మంజూరు చేసింది. అప్పటి ఎమ్మెల్సీ ప్రస్తుత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకపోవడంతో భవన నిర్మాణం పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల మంజూరుకు మంత్రి సంధ్యారాణి కృషి చేశారు. దీంతో భవన నిర్మాణం శరవేగంగా పూర్తయ్యింది. సాలూరు నియోజకవర్గంలో ప్రధానంగా గిరిజన గ్రామాలు, గిరిశిఖర గ్రామాలు, దారిద్యరేఖకు దిగువన ఉన్న అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ ప్రాం తంలో గతంలో 30 పడకల ఆసుపత్రి ఉండేది. అత్యవసర కేసులను ఇక్కడి నుంచి విజయనగరం రిఫర్ చేయాల్సి వచ్చేది. దీంతో రోగులు ఇబ్బంది పడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వంద పడకల ఆసుపత్రి ప్రారంభంకానుండడంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.