A data center is coming! డేటాసెంటర్ వస్తోంది!
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:04 AM
A data center is coming! డేటా సెంటర్కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో రెవెన్యూ అధికారులంతా దీనిపైనే దృష్టి పెట్టారు. వివిధ ప్రాంతాల్లో భూములను పరిశీలించారు. సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదించడానికి కసరత్తు చేస్తున్నారు.
డేటాసెంటర్ వస్తోంది!
భూములపై కసరత్తు
సమగ్ర నివేదిక ఇచ్చే పనిలో రెవెన్యూ అధికారులు
అదనంగా 12 మంది సిబ్బంది నియామకం
భోగాపురం, జూన్ 20(ఆంధ్రజ్యోతి): డేటా సెంటర్కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో రెవెన్యూ అధికారులంతా దీనిపైనే దృష్టి పెట్టారు. వివిధ ప్రాంతాల్లో భూములను పరిశీలించారు. సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదించడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 12 మంది సిబ్బందిని నియమించింది. మొన్నటివరకు ఎయిర్పోర్టు భూసేకరణలో నిమగ్నమైన రెవెన్యూ అధికారులు ఇప్పుడు డేటా సెంటర్పై దృష్టి పెట్టారు. మండలంలోని పోలిపల్లి, భోగాపురం పరిధిలో సుమారు 853.97 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా పోలిపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 14 నుంచి 20, 313 నుంచి 350లో సుమారు 358.7 ఎకరాలను డేటా సెంటర్కు కేటాయించాలనుకుంటున్నారు. ఇందులో రైతులకు సంబంధించి జిరాయితీ 80.85 ఎకరాలు, డిపట్టా 277.85 ఎకరాలు ఉంది. అలాగే 161.41 ఎకరాలకు సంబంధించి న్యాయస్థానంలో కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో అసలు ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాల భూమి అందుబాటులో ఉంది.. వాటిలో జిరాయితీ ఎంత.. డిపట్టా ఎంత.. ప్రభుత్వ భూమి ఎంత అన్న అంశాలపై లోతుగా కసరత్తు చేస్తున్నారు. పక్కాగా గుర్తించిన భూమిలో ప్రస్తుతం ఎంత మంది రైతులు భూమిపై ఉన్నారు, చేతులు మారిన డిపట్టా భూములెన్ని, న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన రైతుల వివరాలపై పూర్తి నివేదికను సిద్ధం చేస్తున్నారు. నివేదిక తయారీ, పక్కా రికార్డు వర్కు, వాస్తవ పరిస్థితులను నిర్ధారించేందుకు భోగాపురానికి అదనంగా హెచ్డీటీతో సహా 12 మంది సిబ్బందిని నియమించారు. వీరంతా విజయనగరం ఆర్డీవో సుదాసాగర్ సూచనలతో తహసీల్దార్ హేమంత్కుమార్ ఆధ్వర్యంలో పనిచేయనున్నారు. ముందుగా పోలిపల్లి పరిధిలోని భూములపై పూర్తి నివేదిక సిద్ధమయ్యాక భోగాపురం రెవెన్యూ, ఇతర భూములపై దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఓపక్క భూములపై పూర్తినివేదిక తయారు చేసేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తుండగా, భూములను డేటా సెంటర్కు ఇవ్వకుండా చూసుకోవాలని కొందరు భోగాపురం రైతులు భావిస్తున్నట్లు సమాచారం. పూర్వీకుల నుంచి వాటిలో సాగు చేసుకుంటున్నా మని, ఈ భూములు తీసుకుంటే ఉపాధి పోతుందని వారు భయపడుతున్నారు.