పీజీ హాస్టల్ భవనం పైనుంచి పడి యువకుడి మృతి
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:23 AM
పెయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టల్ భవనం మూడో అంతస్థు నుంచి కింద పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఇతను సెజ్లోని ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
అచ్యుతాపురం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): పెయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టల్ భవనం మూడో అంతస్థు నుంచి కింద పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఇతను సెజ్లోని ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
విశాఖ జిల్లా ఆనందపురం మండలం లొడగలవానిపాలెం గ్రామానికి చెందిన అలబాని రామకృష్ణ (22) అచ్యుతాపురం సెజ్లోని లారస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మండల కేంద్రంలోని భోగాపురం రోడ్డులో అనధికారికంగా నిర్వహిస్తున్న ఒక పెయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టల్లో వుంటున్నాడు. మంగళవారం ఉదయం సుమారు ఐదు గంటల ప్రాంతంలో రామకృష్ణ మూడో అంతస్థు నుంచి కిందకు పడిపోయాడు. అప్పటికి ఇంకా తెల్లవారకపోవడంతో ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటి తరువాత చుట్టుపక్కల వాళ్లు చూసి, తీవ్ర గాయాలతో వున్న రామకృష్ణను స్థానికంగావున్న ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కుటుంబ సభ్యులకు ఫోన్చేసి సమాచారం ఇచ్చారు. తల్లితండ్రులు వెంకట సూర్యనారాయణ, నారాయణమ్మ, ఇతర బంధువులు చేరుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో సాయంత్రం మృతిచెందాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ వెంకటరావు తెలిపారు.