మీ విజయం ఆనందాన్ని ఇచ్చింది
ABN , Publish Date - May 05 , 2026 | 01:02 AM
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరధిలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారికి పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం తన ఇంట్లో ప్రత్యేంగా విందు ఏర్పాటు చేసి వారితో కలిసి భోజనం చేశారు. పదో తరగతిలో 600 మార్కులకుగాను 580కిపైగా మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది వున్నారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తన నివాసంలో విందు
జ్ఞాపికలతో సత్కారం
నర్సీపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరధిలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారికి పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం తన ఇంట్లో ప్రత్యేంగా విందు ఏర్పాటు చేసి వారితో కలిసి భోజనం చేశారు. పదో తరగతిలో 600 మార్కులకుగాను 580కిపైగా మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది వున్నారు. స్పీకర్ వీరితో గ్రూప్ ఫొటో దిగి, ఏటికొప్పాక కళాకారులు తయారు చేసిన సరస్వతిదేవి బొమ్మలను జ్ఞాపికలుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని చెప్పారు. ఈ సంతోషాన్ని వారితో కలిసి పంచుకొని, భోజనం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు. బాగా చదువుకొని అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో స్థిరపడిన తెలుగువారు అనేకమంది ఉన్నారని గుర్తు చేశారు. పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ పడవద్దని, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక కోచింగ్ను సద్వినియోగం చేసుకొని అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు తలుపులు, నాగేంద్ర, అయ్యన్న కుటుంబ సభ్యులు పద్మావతి, డాక్టర్ సువర్ణ, రాజేశ్, దివ్యశ్రీ పాల్గొన్నారు.