రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - May 17 , 2026 | 11:13 PM
స్థానిక తాండవ వంతెన వద్ద ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇద్దరికి తీవ్ర గాయాలు
పాయకరావుపేట, మే 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక తాండవ వంతెన వద్ద ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పాయకరావుపేట సీఐ ఎస్.శంకరరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కాకినాడ జిల్లా తుని పట్టణంలో కొండవారపేటకు చెందిన మోర్త ప్రేమ్కుమార్(22) తన స్నేహితుడు పాయకరావుపేటలోని లింగాలతోటకాలనీకి చెందిన ఆళ్ళ విజయ్తో కలిసి ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు తుని నుంచి పాయకరావుపేటలోని లింగాలతోటకాలనీకి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. తాండవ వంతెన వద్ద మెడిసి సాయికుమార్ అనే వ్యక్తి పాయకరావుపేట నుంచి తుని వైపునకు ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వెళ్తూ వీరిని బలంగా ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ప్రేమ్కుమార్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందగా, అతడి స్నేహితుడు విజయ్తోపాటు సాయికుమార్కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఎస్ఐ పురుషోత్తం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ తెలిపారు. మృతదేహాన్ని నక్కపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం మృతుడి బంధువులకు అప్పగించామని ఆయన చెప్పారు.