ఉప్ప చెట్ల సోయగం చూడాలంటే కాస్త ఆగాల్సిందే..
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:41 AM
ప్రతి ఏడాది జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆకులన్నీ లేత గులాబీ రంగులో దర్శనమిచ్చే హుకుంపేట మండలం బంగారంగరువు గ్రామంలోని ఉప్ప చెట్ల అందాలు ఈ ఏడాది కాస్త ఆలస్యమయ్యాయి.
ఇప్పుడిప్పుడే రంగుమారుతున్న చెట్ల ఆకులు
గతేడాది జనవరి నెలాఖరు నుంచే లేత గులాబీరంగులో దర్శనమిచ్చిన వైనం
పిక్నిక్ స్పాట్ హుకుంపేట మండలం బంగారంగ రువులో నాగకేశరి చెట్ల తాజా పరిస్థితి
పాడేరు/హుకుంపేట, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ప్రతి ఏడాది జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆకులన్నీ లేత గులాబీ రంగులో దర్శనమిచ్చే హుకుంపేట మండలం బంగారంగరువు గ్రామంలోని ఉప్ప చెట్ల అందాలు ఈ ఏడాది కాస్త ఆలస్యమయ్యాయి. అక్కడున్న నాగకేశరి(స్థానికులు ఉప్ప చెట్లుగా పిలుస్తారు) చెట్ల ఆకులు ప్రతి ఏడాది జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు లేతగులాబీ రంగులో ప్రకృతి ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటాయి. దీంతో సీజన్ కానప్పటికీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆ ప్రాంతం పిక్నిక్ స్పాట్గా ప్రాచుర్యం పొందింది. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది ఆకులు రంగుమారడం ఆలస్యమైంది. ప్రస్తుతం పచ్చని రంగులో ఉన్న ఆకులు గులాబీ రంగులోకి మారడం ప్రారంభమైంది. దీంతో వాటిని తిలకించేందుకు పర్యాటకులు వస్తున్నారు. మరో వారం పది రోజుల్లో ఆకులన్నీ పూర్తిగా లేత గులాబీ రంగులోకి మారుతాయని స్థానికులు చెబుతున్నారు. పర్యాటకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు.