గుళి రాగి సాగుతో దిగుబడులు రెట్టింపు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:47 PM
గిరిజన ప్రాంతంలో గుళి పద్ధతిలో రాగి(చోడి) సాగు చేసుకోవడం వల్ల రెట్టింపు దిగుబడులు సాధించవచ్చునని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతులు మూడు రెట్లు అధికంగా ఎకరాకు 14-16 క్వింటాళ్ల దిగుబడులు సాధిస్తున్నారు.
ఎకరానికి 14-16 క్వింటాళ్లు
ఏపీసీఎన్ఎఫ్ ద్వారా రైతులకు ప్రోత్సాహం
జిల్లాలో ఈ ఏడాది 3,500 మంది రైతులతో సాగుకు ప్రణాళిక
చింతపల్లి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో గుళి పద్ధతిలో రాగి(చోడి) సాగు చేసుకోవడం వల్ల రెట్టింపు దిగుబడులు సాధించవచ్చునని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతులు మూడు రెట్లు అధికంగా ఎకరాకు 14-16 క్వింటాళ్ల దిగుబడులు సాధిస్తున్నారు.
గుళి పద్ధతిని వ్యవసాయశాఖ ఏపీసీఎన్ఎఫ్(ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్) ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాది జిల్లాలో 3,500 మంది రైతులతో ఒక్కొక్క ఎకరం చొప్పున సాగు చేయించేందుకు ఏపీసీఎన్ఎఫ్, వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గుళి పద్ధతిలో రాగిని సేంద్రీయ పద్ధతిలో రైతులు సాగు చేస్తున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో గిరిజన రైతులు 18,176 హెక్టారుల్లో సాగు చేస్తున్నారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం(జెడ్బీఎన్ఎఫ్)లో భాగంగా చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ వచ్చింది. తాజాగా ఇదే కార్యక్రమాన్ని ఏపీసీఎన్ఎఫ్ ద్వారా వ్యవసాయశాఖ కొనసాగిస్తున్నది. ఆచార్య ఎన్జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుళిరాగి సాగును శ్రీకాకుళం, విజయనగరం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విస్తరింపజేయాలని తాజాగా నిర్వహించిన జెడ్ఆర్ఈఏసీ సమావేశంలో తీర్మానించారు.